హైదరాబాద్ : హైదరాబాద్లోని విమానాశ్రయం, రైల్వే, బస్సుల ద్వారా, ఇతర రవాణా మార్గాల ద్వారా రాష్ట్రానికి వచ్చే అక్రమ మద్యం అరికట్టడానికి పూర్తిస్థాయిలో విస్తృత తనిఖీలు చేయాలని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అధికారులను ఆదేశించారు. అక్రమ మద్యం రవాణా పై రాష్ట్ర ఎక్సైజ్ శాఖ అధికారులు రైల్వే, బస్ స్టేషన్, అంతర్ రాష్ట్ర బస్సు రవాణా ఆపరేటర్ల కు తెలిసేలా నోటీసులు, ఇచ్చి అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలన్నారు.
గురువారం రాష్ట్ర సచివాలయంలోని తన కార్యాలయంలో రాష్ట్ర ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖలపై మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమీక్ష సమావేశంలో ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రాష్ట్రానికి దిగుమతి అవుతున్న అక్రమ మద్యం నివారణపై ఉక్కు పాదం మోపాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
తెలంగాణ ప్రొహిబిషన్ & ఎక్సైజ్ చట్టం 1968 సెక్షన్ ప్రకారం అనుమతి లేకుండా తెలంగాణలోకి ఇతర రాష్ట్రాల మద్యం ఎంత చిన్న పరిమాణం లోనైనా తీసుకురావడం శిక్షార్హమైన నేరం. అందుకు సెక్షన్ 34 (1) ప్రకారం లక్ష రూపాయలు జరిమానాతో పాటు ఐదు సంవత్సరాల జైలు శిక్ష పడే అవకాశం ఉందని, వీటిపై అవగాహన కార్యక్రమాలను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మద్యం ఇతర రాష్ట్రాల నుండి సరఫరా చేసే వ్యక్తులపై విధించే శిక్షను ప్రస్తుతం 5 సంవత్సరాల జైలు శిక్షను 7 సంవత్సరాలకు పెంచేలా ప్రతిపాదనలు తయారు చేయాలన్నారు.
అలాగే రాష్ట్రంలో ఉన్న ఫంక్షన్ హాల్స్ యజమానులు, ఈవెంట్ నిర్వాహకులు, కన్వెన్షన్ సెంటర్ నిర్వాహకులు, బ్యాంకెట్ హాల్ నిర్వాహకులు, హోటల్ నిర్వాహకులకు అక్రమ మద్యం సరఫరా పై అవగాహన కల్పించాలని మంత్రి అధికారులకు సూచించారు. నిబంధనలు పాటించకుండా అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టి PD Act కింద చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
డిఫెన్స్ క్యాంటీన్ల లోని మద్యాన్ని బయటి వ్యక్తులకు అమ్మటంపై నిఘా పెట్టి తగు చర్యలు చేపట్టాలన్నారు. అక్రమ మద్యం సరఫరా చేస్తున్న వారి వివరాలను ఎక్సైజ్ శాఖ అధికారులకు అందించే వారి సమాచారాన్ని గోప్యంగా ఉంచాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ శాఖ అడిషనల్ కమిషనర్ అజయ్ కుమార్, జాయింట్ కమిషనర్లు ఖురేషీ, కేఏబీ శాస్త్రీ, సహాయ కమిషనర్లు చంద్రయ్య గౌడ్ ,శ్రీనివాస్, ఈఎస్లు ఏ. సత్యనారాయణ, రవీందర్ రావు, అరుణ్ కుమార్, విజయభాస్కర్ గౌడ్ తదితర అధికారులు పాల్గొన్నారు.