త్రివిధ దళాల్లో నియామకాలకోసం తీసుకొచ్చిన అగ్నిపథ్ స్కీం బీజేపీ సర్కారు పిచ్చి చర్య అని మంత్రి శ్రీనివాస్గౌడ్ మండిపడ్డారు. ఇది దేశ భవిష్యత్, రక్షణకు గొడ్డలిపెట్టులాంటి నిర్ణయమని అభివర్ణించారు. సికింద్రాబాద్ లో జరిగిన ఘటనలో తీవ్రంగా గాయపడిన మహబూబ్నగర్ పట్టణంలోని పాలకొండకు చెందిన జుర్రు శ్రీకాంత్ తండ్రి తిరుపతయ్యను మంత్రి ఫోన్లో పరామర్శించారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్గౌడ్ మాట్లాడుతూ, సికింద్రాబాద్ ఘటనలో మృతిచెందిన వరంగల్కు చెందిన రాకేశ్ కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఆ కుటుంబానికి వెంటనే ఎక్స్గ్రేషియా చెల్లించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో గాయపడిన క్షతగాత్రులకు మెరుగైన చికిత్సను అందించాలని కోరారు. దేశ భద్రత విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అవివేకంగా ఉందన్నారు. ఈ నిర్ణయం వల్ల సైనిక బలగాలు నిర్వీర్యం అవుతాయని ఆందోళన వ్యక్తంచేశారు.
మోడీ అనాలోచిత నిర్ణయం వల్ల మొన్న రైతులు, నేడు యువత ఆందోళన చెందుతున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేస్తున్నారని, అదానీ, అంబానీలకు దేశాన్ని పంచిపెడుతున్నారని మండిపడ్డారు. రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రకటించిన కేంద్ర సర్కారు.. ఆ ఊసే ఎత్తకుండా యువతను మోసం చేస్తున్నదన్నారు. బీజేపీ సర్కారు నిర్వాకం వల్ల విదేశాల్లో ఉన్న భారతీయులు కూడా భయాందోళనకు గురవుతున్నారని చెప్పారు. మోదీ అనాలోచిత నిర్ణయాలపై జాతీయ స్థాయిలో సీఎం కేసీఆర్ ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేస్తున్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ పేర్కొన్నారు.