నల్లగొండ : ఉవ్వెత్తున ఎగిసిన ఉద్యమంలో తెలంగాణ పోరాటం కోసం ఉద్యోగ సంఘాల పాత్ర వెలకట్టలేనిదని… రాష్ట్ర సాధన కోసం రాయలసీమ సరిహద్దుల్లోకి వెళ్లి గర్జించిన తమపై… గుట్కా కేసులో అరెస్టయి జైలుకుపోయిన బండి సంజయ్కు మాట్లాడే అర్హత లేదని రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగ సంఘాల నేతలు ఉద్యోగులపై బండి సంజయ్ వివాదాస్పదంగా మాట్లాడిన తీరును మంత్రి దుయ్యబట్టారు. చౌటుప్పల్ పట్టణంలోని హైవే 9 హోటల్లో శ్రీనివాస్ గౌడ్ మీడియాతో మాట్లాడారు.
రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఉద్యోగ సంఘాల నేతలపై వ్యక్తిగత ఆరోపణలు చేయడం ఆయన దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకు ఎంతో శ్రమించిన ఉద్యోగ సంఘాలు ఉద్యోగ సంఘాల నేతలను ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేని బండి సంజయ్ విమర్శిస్తే ఊరుకునేది లేదని ఆయన హెచ్చరించారు. ఒక్కొక్క ఉద్యోగ సంఘం నేత వెనక లక్షలాదిమంది ఉద్యోగులు ఉన్నారని, వారి వెంట యావత్ తెలంగాణ జాతి తెలంగాణ నాయకత్వం ఉంటుందన్నారు. ఉద్యోగులకు ఏ చిన్న సమస్య వచ్చినా అండగా నిలబడతామన్నారు. సభ్యత, సంస్కారం మరచి సంస్కారహీనంగా మాట్లాడడం బాధాకరమని ఇటువంటి విమర్శలను చూస్తూ సహించబోమన్నారు. ఉద్యోగుల జోలికి వస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని వారికి క్షమాపణలు చెప్పకుంటే ఊరుకునేది లేదని ఖబడ్దార్ బండి సంజయ్ అంటూ శ్రీనివాస్ గౌడ్ హెచ్చరించారు.
తెలంగాణ కోసం కొట్లాడి కేసులకు ఎదురొడ్డి జైలుకెళ్ళిన చరిత్ర తమది, మా ఉద్యోగ సంఘాల నేతలదని… గుట్కా కేసుల్లో చిల్లర మల్లర కేసుల్లో అరెస్ట్ అయిన నేపథ్యం బండి సంజయ్దని మంత్రి దుయ్యబట్టారు. ప్రాణాలకు తెగించి రాష్ట్రం కోసం కొట్లాడిన నేతలపై చిల్లరగా మాట్లాడడం, వారిని బెదిరించే విధంగా ప్రవర్తిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. నోరు ఉందని ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోబోమన్నారు. కచ్చితంగా ఉద్యోగులకు, ఉద్యోగ సంఘాల నేతలకు తాము అండగా నిలబడి ఇటువంటి కుట్రలను ఎదుర్కొంటామని ఆయన అన్నారు.
బండి సంజయ్కి దమ్ముంటే పాత పెన్షన్ విధానాన్ని రద్దు పరచి, వివిధ ఉద్యోగ సంక్షేమ పథకాలు ఉద్యోగాలకు అందేటట్లు చేయాలని, ప్రైవేటీకరణతో ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాన్ని అడ్డుకొని రూరల్ రిజర్వేషన్ కింద బడుగు బలహీన వర్గాలు కోల్పోతున్న ఉద్యోగాలను వారికి దక్కేటట్లు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బండి సంజయ్కు గానీ, రాష్ట్ర బిజెపి నాయకులకు గానీ బీసీలపై ప్రేమ ఉంటే ఈ దేశంలో ఉన్న 80 కోట్ల మంది జనాభాకు ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
ఉద్యోగ సంఘాల నేతలు నాటి ఉద్యమ సమయంలో అన్ని రాజకీయ పార్టీల నాయకుల వేదికలపై తెలంగాణ ఉద్యమ వాణిని వినిపించారని గుర్తు చేశారు. ఏర్పడ్డ తెలంగాణలో ఎవరు నిజాయితీగా ఈ తెలంగాణ కోసం కొట్లాడారో ఎవరి చేతుల్లో అయితే ఈ తెలంగాణ రాష్ట్రం సకల జనులకు సబ్బండ వర్గాలకు సంక్షేమ అభివృద్ధి పలాలు అందజేస్తుందో ఆలోచించి వారికి అండగా నిలబడే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఇంకోసారి టీఎన్జీవో నేతల పైన గానీ, ఉద్యోగుల పైన గానీ ఎవరైనా విమర్శలు చేస్తే సహించేది లేదని ఆయన అన్నారు. బిజెపి నాయకులు ఎన్ని కుప్పిగంతులు వేసిన మునుగోడులో ఉద్యమ నేత ఆధ్వర్యంలో అభివృద్ధిలో దూసుకుపోతున్న అధికార టీఆర్ఎస్ పార్టీ ఘన విజయం సాధిస్తుందని మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, గౌడ సంఘాల నాయకులు పల్లె లక్ష్మణ్ గౌడ్, వేములయ్య గౌడ్, వట్టికూటి రామారావు, బొమ్మగాని ప్రభాకర్, వామపక్షాల నేతలు, టిఆర్ఎస్ పార్టీ నేతలు పాల్గొన్నారు.