మహబూబ్నగర్ : తెలంగాణ రాష్ట్రం పట్ల కేంద్రం వ్యవహరిస్తున్న తీరును, కుట్రలను ప్రజలను గమనిస్తున్నారు.. అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాన్ని ప్రోత్సహించకుండా దాడులు చేయడం ఏంటి? ఇదేం సంస్కృతి అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఈడీ, ఐటీ సంస్థలను తమ జేబు సంస్థలుగా మార్చుకుని కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ కవితపై కుట్రలు, మంత్రి గంగుల కమలాకర్పై ఈడీ దాడులు, మరో మంత్రి మల్లారెడ్డిపై ఐటీ దాడులతో కేంద్ర ప్రభుత్వం అరాచకాలకు పాల్పడుతోందని మండిపడ్డారు.
మహబూబ్నగర్లోని మంత్రి శ్రీనివాస్ గౌడ్ క్యాంపు కార్యాలయంలో ఉమ్మడి జిల్లాకు చెందిన మంత్రులు శ్రీనివాస్ గౌడ్, నిరంజన్ రెడ్డి.. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఎంపీలతో కలిసి మీడియాతో మాట్లాడారు.
దేశంలో ఎక్కడా తప్పులు జరగనట్లు.. ఒక్క తెలంగాణలో మాత్రమే తప్పులు జరుగుతున్నట్లు కేంద్రం ప్రవర్తిస్తుందని శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. తెలంగాణ గొంతు పిసికి అల్లకల్లోలం సృష్టించాలని కేంద్రం ప్రయత్నిస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణలో పేకాట, జూదం బంద్ అయ్యాయని తెలిపారు. కానీ అదే బీజేపీ పాలిత రాష్ట్రాలైన గోవా, ముంబైలలో కేసినోలు నడిపిస్తున్నారని పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా అనేక నూతన మెడికల్ కాలేజీలు మంజూరు చేసినా.. తెలంగాణకు కేవలం ఒక్కటంటే ఒక్కటి ఇవ్వలేదు. కానీ మెడికల్ కళాశాలలతో సేవ చేస్తున్న మల్లారెడ్డిపై మాత్రం కేంద్రం దాడులకు దిగుతోందని ధ్వజమెత్తారు.
కేంద్రం కుట్రలు చేసినా ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టి మాత్రం కేవలం అభివృద్ధి పైనే ఉంటుందని శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. మాకు ఇలాంటి కుట్రల అవసరం లేదు. తమ వద్ద కూడా ఏసీబీ, సీఐడీ లాంటి అనేక సంస్థలు ఉన్న దాడుల సంస్కృతికి ఏనాడూ పాల్పడలేదని చెప్పారు. కేంద్రం చేస్తున్న దాడులకు భయపడం, ప్రతిదాడులకు సిద్ధం. మేం చేతులు ముడుచుకోబోము. బీజేపీ నాయకులు మాత్రమే సచ్చీలురా… మేము కాదా? అని ప్రశ్నించారు.
20 రాష్ట్రాల్లో బీజేపీ పాలిత ప్రభుత్వాలు ఉన్నాయి.. కేంద్ర ప్రభుత్వానికి అక్కడ జరుగుతున్న అవినీతి కనిపించడం లేదా…? అని మంత్రి శ్రీనివాస్ గౌడ్ నిలదీశారు. టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయాలని చూసిన ఉదంతంలో అన్ని ఆధారాలు ఉన్నాయి. విచారణ జరుగుతున్నది. కానీ మంత్రి మల్లారెడ్డి పై ఎలాంటి ఆధారాలు లేకుండా ఐటీ దాడులు చేస్తున్నారు. ఇది సరికాదని శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు.
ఈ సమావేశంలో ఎంపీలు మన్నె శ్రీనివాస్ రెడ్డి, పోతుగంటి రాములు, ఎమ్మెల్యేలు గువ్వల బాలరాజు, లక్ష్మారెడ్డి, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మర్రి జనార్దన్ రెడ్డి, రాజేందర్ రెడ్డి, చిట్టెం రామ్మోహన్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, అంజయ్య యాదవ్, నరేందర్ రెడ్డి, డిసిసిబి చైర్మన్ నిజాం పాషా, ముడా చైర్మన్ గంజి వెంకన్న, జిల్లా గ్రంథాలయాల సంస్థ చైర్మన్ రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మార్కెట్ కమిటీ చైర్మన్ రహమాన్ తదితరులున్నారు.