హైదరాబాద్, ఆగస్టు 9 (నమస్తే తెలంగాణ): సోనియాను దయ్యం, భూతం అన్న రేవంత్ తమ పార్టీకి రాష్ట్ర అధ్యక్షుడైపోయాడని కాంగ్రెస్ పార్టీ నేతలు తలలు పట్టుకొంటున్నారని, సమయం రాగానే ఆయనకు పిండం పెట్టేందుకు ఆ పార్టీ నేతలు సిద్ధంగా ఉన్నారని మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. పీసీసీని ‘ప్రదేశ్ క్రిమినల్స్ సెంటర్’గా మార్చి న ఘనత రేవంత్కే దక్కిందని ఎద్దేవా చేశారు. బుధవారం ఆయన బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయంలో ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించేదిలేదని రేవంత్ను హెచ్చరించారు. చావునోట్లోకి వెళ్లి తెలంగాణ తెచ్చి, రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ప్రగతిపథంలో నడిపిస్తున్న సీఎం కేసీఆర్కు పిండం పెడ్తామనడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. గద్దర్ అందరివాడని, ఆ ప్రజావాగ్గేయకారుడిని కాంగ్రెస్ పార్టీ సొంతమైనట్టు రేవంత్ మాట్లాడటాన్ని ఆక్షేపించారు. గద్దర్ సొంతంగా పార్టీ పెట్టుకొనేందుకు దరఖాస్తు చేసుకున్న విషయాన్ని గుర్తుచేశారు. జై తెలంగాణ అన్నందుకు గద్దర్పై కాల్పులు జరిపించిన చంద్రబాబు చరిత్ర, ఆ తర్వాత చర్చల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం నక్సలైట్లను కాల్చి చంపిన దుర్మార్గాన్ని తెలంగాణ సమాజం ఎప్పటికీ మరచిపోదని చెప్పారు. గద్దర్ మరణాన్ని రాజకీయం చేసే ఎత్తుగడలు సాగబోవని తెలిపారు. రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించాలని కాంగ్రెస్ ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్కు వందకు పైగా సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తంచేశారు.
రేవంత్తోనే కాంగ్రెస్ పతనం: ఆల, సారయ్య
రేవంత్రెడ్డిని పీసీసీ అధ్యక్షుడిగా చేయటంతోనే రాష్ట్రంలో కాంగ్రెస్ పతనం మొదలైందని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్ పేరుకూడా ఎత్తే స్థాయి రేవంత్కు లేదని అన్నారు. ఇంగితజ్ఞానం ఉన్నవారెవరైనా పిండం పెడ్తామని మాట్లాడతారా? అని ప్రశ్నించారు. రేవంత్ ఇలాగే మాట్లాడుకుంటూ పోతే కాంగ్రెస్కు ఇప్పుడున్న 6 సీట్లు.. వచ్చే ఎన్నికల్లో మూడు, నాలుగుకు తగ్గినా ఆశ్చర్యంలేదని పేర్కొన్నారు. పిండాలు ఎప్పుడు పెడ్తారు? ఎవరు పెడ్తారు? అనే విషయాన్ని రేవంత్ తన కుటుంబ సభ్యులను అడిగితే చెప్తారని ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య చురకలంటించారు. రేవంత్ రాకతో కాంగ్రెస్ మరింత భ్రష్టుపట్టిందని పేర్కొన్నారు. ఆయనకు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలే తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు.
సోనియాను దయ్యం, భూతం అన్న రేవంత్కు సమయం రాగానే పిండం పెట్టేందుకు కాంగ్రెస్ కార్యకర్తలే సిద్ధం గా ఉన్నారు. పీసీసీని ‘ప్రదేశ్ క్రిమినల్స్ సెంటర్’గా మార్చిన ఘనత రేవంత్కే దక్కుతుంది. నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మాట్లాడితే సహించం.
-మంత్రి శ్రీనివాస్గౌడ్