మహబూబ్నగర్ : సొంతూరిని బాగు చేసుకోవాలనే ఉద్దేశంతోనే.. హైదరాబాద్లో ఏ మాత్రం కష్టపడకుండా గెలిచే అవకాశం ఉన్న అసెంబ్లీ స్థానాలను సైతం వదిలేసి మహబూబ్నగర్ వచ్చి ఎన్నికల్లో పోటీ చేశానని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడల శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. తను చదువుకున్న మహబూబ్ నగర్ ఎంవీఎస్ డిగ్రీ కళాశాల 1985-88 బ్యాచ్కు చెందిన డిగ్రీ మిత్రులు గెట్ టు గెదర్ కేసీఆర్ అర్బన్ ఎకో పార్కులో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరై, డిగ్రీ చదువుకున్న రోజులను గుర్తు చేసుకున్నారు.
నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే మంత్రి కాసేపు తన పనులన్నింటినీ పక్కనపెట్టి తన కళాశాల మిత్రులతో సమావేశమై గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. ఉద్యమ సమయంలో తెలంగాణ ఉద్యోగులు, అధికారుల పట్ల ఎంతో వివక్ష ఉండేదని తెలిపారు. ఉద్యోగ జీవితం, టీజీవో స్థాపన, ఉద్యమ సమయం, తెలంగాణ పోరాటం, కేసీఆర్తో కలిసి చేసిన పోరాటంలో ముందుకు సాగడం, రాష్ట్ర సాధన, ఎమ్మెల్యేగా ఎన్నికవడం, ఆ తర్వాత మంత్రిగా బాధ్యతలు చేపట్టడం… చూస్తుండగానే జరిగిపోయాయని తెలిపారు. రాజకీయాల్లోకి రావాలని గతంలో ఎన్నడూ అనుకోలేదని, కానీ ఇప్పుడు ప్రజలకు సేవ చేసే అవకాశం రావడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందన్నారు. తమ కుటుంబంలో కనీసం సర్పంచ్ స్థాయి పదవిలో ఉన్న వారు కూడా ఎవరూ లేకపోయినా, రాజకీయంగా ఎవరి వెన్నుదన్ను లేకపోయినా ఈ స్థాయికి రావడం మహబూబ్ నగర్ ప్రజల సహకారం వల్లే సాధ్యమైందన్నారు.
మహబూబ్ నగర్ను ఊహించని స్థాయిలో అభివృద్ధి చేయడమే తన కర్తవ్యమని అన్నారు. సీఎం కేసీఆర్ సహకారంతో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును సాధ్యమైనంత త్వరగా పూర్తి చేసి సాగునీటిని అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేసేందుకు కృషిచేయడం తన లక్ష్యమని మంత్రి వివరించారు. అనాధలకు క్రీడా పాఠశాల ఏర్పాటు చేసి వారిని అత్యున్నత క్రీడాకారులుగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామన్నారు. వృద్ధాశ్రమం ఏర్పాటు చేసి ముదిమి వయసులో ఇబ్బందులు పడుతున్న వారికి అండగా నిలుస్తామని తెలిపారు. మహబూబ్ నగర్ను హైదరాబాద్కు ధీటుగా తీర్చిదిద్దుతామన్నారు.
ఈ గెట్ టు గెదర్లో పశుసంవర్ధక శాఖ డైరెక్టర్ నాగరత్నమ్మ, వనపర్తి జిల్లా వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, నారాయణపేట ఆర్డీఓ రాంచందర్, పీఆర్టీయూ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నారాయణ గౌడ్, రఘురామ్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.