రవీంద్రభారతి, ఏప్రిల్ 24 : నాటకరంగం చాలా గొప్పదని, తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక యువకళాకారులను వెలుగులోకి తెచ్చిన ఘనత రాష్ట్ర ప్రభుత్వానికే దక్కుతున్నదని అబ్కారీ, సాంస్కృతిక శాఖ మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ, తెలంగాణ రంగస్థల సమాఖ్య (తెర) సంయుక్తంగా నిర్వహించిన నాలుగు రోజుల తెలంగాణ యువ నాటకోత్సవం ఆదివారం రవీంద్రభారతిలో ఘనంగా ముగిసింది. దీనికి మంత్రి వీ శ్రీనివాస్గౌడ్ హాజరై, మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తరువాత నాటక రంగం అభివృద్ధి దిశగా పయనిస్తున్నదని చెప్పారు. తెలంగాణ యువ నాటకోత్సవం పేరిట యువకుల ప్రతిభను ప్రపంచానికి పరిచయం చేస్తున్నామని తెలిపారు. 600 మంది కళాకారులు 10 నాటికలను ప్రదర్శించారని పేర్కొన్నారు. యువ నాటకోత్సవానికి తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ నుండి రూ.40వేల పారితోషికం అందిస్తున్నామని చెప్పారు. యువ నాటకోత్సవాన్ని గొప్పగా నిర్వహించిన భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణ, యువకళాకారులను మంత్రి అభినందించారు.