హైదరాబాద్, మే 26 (నమస్తే తెలంగాణ): ధాన్యం టెండర్లు, సన్నబియ్యం టెండర్లు, ధాన్యం కొనుగోళ్లలో కేటీఆర్, మహేశ్వర్రెడ్డి అడిగే ప్రతిదానికీ సమాధానం చెప్పలేమని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అన్నారు. వాళ్లు చేసే ఆరోపణల్లో ఒక్క శాతం కూడా నిజం లేదని చెప్పారు. ఆదివారం మంత్రి శ్రీధర్బాబు, ఎమ్మెల్సీ జీవన్రెడ్డితో కలిసి ధాన్యం టెండర్ల ఆరోపణలపై గాంధీభవన్లో మీడియాతో మాట్లాడారు. తాలు, తరుగు పేరుతో రైతుల నుంచి లంచాలు తీసుకుంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ‘మహిళా సంఘాల ఆధ్వర్యంలో 7,200 కొనుగోలు కేంద్రాలు, మూడు వేల మిల్లులు ఉండగా తాము కమీషన్ తీసుకున్నామట. ఇందులో రూ.వెయ్యి కోట్లు నేను తీసుకున్నానట. రూ.100 కోట్లు ఎవరికో పంపిచ్చానట. ఇంతకన్నా పచ్చి అబద్ధం. దుర్మార్గమైన మాట లు మరోటి లేవు. వెంటనే ఈ ఆరోపణలను ఉపసంహరించుకోవాలి’ అని అన్నారు.
సన్నబియ్యం కొనలేదు..సన్నవడ్లు కొనలేదు
సన్నబియ్యం టెండర్లలో రూ. 300 కోట్ల కుంభకోణం జరిగిందని ఆరోపిస్తున్నారని, కానీ ఇప్పటి వరకు ఒక్క గింజ కూడా సన్నబియ్యం కొనలేదని, ఒక్క గింజ సన్నవడ్లు అమ్మలేదని ఉత్తమ్ తెలిపారు. సన్నబియ్యం కొనుగోలుకు టెండర్ వేసినా, వాటిని నిలిపివేశామని వివరించారు. తమ వద్ద ఉన్న సన్నబియ్యాన్ని మిల్లింగ్ చేసి సరఫరా చేయబోతున్నామని వెల్లడించారు. సన్నబియ్యం టెండర్ల కండీషన్ల ప్రకారం రూ.42 చొప్పున బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్, బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి ఎంత సన్నబియ్యం ఇస్తే అంత కొనుగోలు చేస్తామని తెలిపారు.
మిల్లర్లను కలవటమే తక్కువ
‘నేను ఉత్తమ్కుమార్రెడ్డిని.. నా నీతి నిజాయతీని 30 ఏండ్లలో ఎవరూ ప్రశ్నించలేదు. నేను రైస్మిల్లర్ల నుంచి పైసలు తీసుకోవడం పక్కనపెడితే, అసలు నేను వాళ్లను కలవటమే తక్కువ. వాళ్లు సంఘం ద్వారా వస్తే మాత్రమే కలుస్తాను’ అని స్పష్టంచేశారు. 35 ఏండ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని, మిల్లర్ల విషయంలో పూర్తి నిబంధనల ప్రకారం వెళ్తున్న ఏకైక ప్రభుత్వం తమదేనని తెలిపారు. తప్పుచేసే మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు.
ధాన్యం అమ్మేశాక సర్కారుకేం సంబంధం
టెండర్లద్వారా విక్రయించిన ధాన్యం మిల్లు ల్లో లేదని వస్తున్న ఆరోపణలపై మీడియా ప్రశ్నించగా.. ‘మిల్లర్ల వద్ద ధాన్యం ఉందని మా రికార్డుల్లో ఉన్నది. ఎక్కడ, ఎలా ఉన్న ధాన్యాన్ని అలాగే అమ్మేశాం.. ఆ తర్వాత ప్రభుత్వ బాధ్యత ఉండదు’ అని తెలిపారు. టెండర్లలో విక్రయించిన ధాన్యం మిల్లర్లు ఇవ్వ టం లేదనే అంశంపై ప్రశ్నించగా..ప్రభుత్వం ఇచ్చిన ధాన్యాన్ని అమ్మేసుకొని, ఆ స్టాక్ ఇవ్వాలని ఇబ్బందిపెడితే ఆ మిల్లర్లపై చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.గత ప్రభుత్వం ధాన్యాన్ని వేలం వేయగా క్వింటాలుకు రూ. 1,700 ధర వచ్చిందని, తాము వేసిన వేలం లో దొడ్డురకానికి రూ.2,007 ధర రాగా సన్నరకానికి రూ.2,407 ధర వచ్చిందని వివరించారు.అన్నింటికీ కలిపి సగటు ధర రూ. 2,022 వచ్చిందని తెలిపారు. తద్వారా ప్రభుత్వానికి రూ.1100 కోట్ల అదనపు ఆదాయం వచ్చిందని చెప్పారు. కేంద్రియబండార్ సంస్థ ను బ్లాక్ లిస్ట్లో పెట్టింది బీఆర్ఎస్ సర్కారేనని, దాన్ని తిరిగి తొలగించిందీ బీఆర్ఎస్ సర్కారేనని తెలిపారు.
మహేశ్వర్రెడ్డిని పెంచి పోషించాం
బీజేపీపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి చాలా జూనియర్ అని, కొన్ని విషయాలు తెలుసుకొని మాట్లాడితే బాగుంటుందని ఉత్తమ్ అన్నారు. ఆయనను కాంగ్రెస్సే పోషించిందాగా.. అని మీడియా ప్రశ్నించగా జూనియర్ కాబట్టే పెంచి పోషించినం అని మంత్రి సమాధానమిచ్చారు. కిషన్రెడ్డిని ఓవర్టేక్ చేయాలని, పార్టీలో ఓవర్స్పీడ్గా ఎదగాలని మహేశ్వర్రెడ్డి అనుకుంటున్నారని విమర్శించారు.
పాలనలో పొరపాట్లు : మంత్రి శ్రీధర్బాబు
పరిపాలనలో పొరపాట్లు జరుగుతాయని మంత్రి శ్రీధర్బాబు అన్నారు. అందుకే గత ప్రభుత్వాన్ని సలహాలు, సూచనలు ఇవ్వాలని అనేకసార్లు కోరామని తెలిపారు. బీఆర్ఎస్, బీజేపీ కలిసినా సీట్లు రావట్లేదనే అకసుతో కాంగ్రెస్పై అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని, మార్పునకు అడ్డువస్తే సహించేది లేదని వెల్లడించారు.
సివిల్ సైప్లె అప్పులకు కేంద్రమే కారణం?: ఎమ్మెల్సీ జీవన్రెడ్డి
సివిల్ సైప్లె ఇంత అప్పుల్లోకి పోవడానికి కేం ద్రం కారణం కాదా? అని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ప్రశ్నించారు. బీజేపీలోకి వెళ్లగానే వాళ్ల తప్పులన్నీ ఒప్పులుగా మారాయా? అని ప్రశ్నించా రు. మహేశ్వర్రెడ్డి ఎకువ మాట్లాడితే పెద్ద లీ డర్ కాలేరని, వాస్తవాలు మాట్లాడితేనే అవుతారని హితవు పలికారు.గత ప్రభు త్వం ఏనాడై నా తడిసిన ధాన్యం కొనుగోలు చేసిందా? అని ప్రశ్నించారు. మిల్లర్లు చేసిన తప్పులకు ప్రభుత్వాన్ని బద్నాం చేస్తారా? అని ప్రశ్నించారు.
ఉత్తమ్ డొల్లతనం బయటపడింది: మహేశ్వర్రెడ్డి
మంత్రి ఉత్తమ్కుమారెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్రెడ్డి స్పందించారు. మంత్రి ఉత్తమ్ కుమార్రెడ్డి మాటలన్నీ ఉత్త మాటలేనని ఎద్దేవా చేశారు. సివిల్ సైప్లె శాఖలో అవకతవకలు జరగటం, రూ.వందల కోట్ల కుంభకోణం జరగటం వాస్తవమని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి తాను ఆధారాలతో సహా ప్రశ్నించిన 19 అంశాలకు మంత్రి ఉత్తమ్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారని అన్నారు. ఈ ప్రశ్నలకు సమాధానం దాటవేయడంతోనే మంత్రి డొల్లతనం బయటపడిందని ఎద్దేవా చేశారు. పూర్తి వివరాలను సోమవారం వెల్లడిస్తానని పేర్కొన్నారు.