మాదాపూర్, డిసెంబర్ 23: తెలంగాణ ప్రభుత్వ విధానాలు, అమలుచేసిన సంస్కరణలే రాష్ట్రంలో పారిశ్రామికవృద్ధికి దోహదపడ్డాయని రాష్ట్ర ఆర్థిక వైద్యారోగ్య శాఖల మంత్రి టీ హరీశ్రావు అన్నారు. గురువారం మాదాపూర్లోని హెచ్ఐసీసీలో క్రెడాయ్ తెలంగాణ ఆధ్వర్యంలో జరిగిన క్రెడాయ్ రియల్టీ అవార్డ్స్ ఫర్ తెలంగాణ-2021 కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ అభివృద్ధి లాగే క్రెడాయ్ కూడా వృద్ధి పొందుతున్నదని తెలిపారు. నగరంలోనే కాకుండా జిల్లాల్లోనూ వ్యాపారం బాగా సాగుతున్నదని చెప్పారు. ఇండీడ్ అనే సంస్థ జరిపిన సర్వేలో దేశంలో ఎక్కడ పనిచేసేందుకు ఇష్టపడుతారని అడిగితే హైదరాబాదే తమ ప్రాధాన్యమని మెజారిటీ యువ ఉద్యోగులు సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. దేశంలోనే హైదరాబాద్, తెలంగాణ బెస్ట్గా నిలిచిందని వివరించారు. సివిల్స్ ఉద్యోగులు రిటైర్ అయ్యాక కూడా ఇక్కడే ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. గత రెండేండ్లుగా పరిశ్రమ కష్టకాలం ఎదుర్కొన్నదని, అలాంటి తరుణంలోనూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దేశంలోనే అగ్రస్థానంలో కొనసాగిందని గుర్తుచేశారు. హైదరాబాద్ విశ్వనగరంగా ప్రపంచ పటంలో నిలబడిందని చెప్పారు. నగరం చుట్టూ భూములు బంగారు సిరులు ఒలికిస్తున్నాయని చెప్పారు. తెలంగాణ ఏర్పడిన 2014-15 లో తలసరి ఆదాయం.. రూ.1,24,104 కోట్లు ఉంటే, 2020-21 నాటికి రూ.2,37,632 కోట్లకు పెంచగలిగామని తెలిపారు. దేశ తలసరి ఆదాయం రూ.1,28,829 కోట్లు మాత్రమేనని గుర్తుచేశారు. దేశంలోని పెద్ద రాష్ర్టాల్లో విద్యుత్తు వినియోగంలోనూ తెలంగాణ నంబర్వన్ స్థానంలో నిలిచిందని వెల్లడించారు. ఐటీ రంగంలో అద్భుత వృద్ధి నమోదుచేసిందని, ప్రత్యేకంగా, పరోక్షంగా 20 లక్షల మంది ఉపాధి పొందుతున్నారని వివరించారు.
కరోనా ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువ, తీవ్రత తక్కువ అని అధ్యయనాలు చెప్తున్నప్పటికీ నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. ఈ రోజుతో వంద శాతం మొదటిడోసు పూర్తి చేసుకొన్నామని, రెండో డోసు 61 శాతం పూర్తయిందని వెల్లడించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే భూపాల్రెడ్డి, క్రెడాయ్ తెలంగాణ అధ్యక్షుడు మురళీకృష్ణారెడ్డి, మాజీ అధ్యక్షుడు శేఖర్రెడ్డి, ఉపాధ్యక్షులు అజయ్కుమార్, మధుసూదన్రెడ్డి, జగన్మోహన్, పాండురంగారెడ్డి, కార్యదర్శి ఇంద్రసేనారెడ్డి, కోశాధికారి ఎన్ ప్రశాంత్రావు, ప్రేమ్సాగర్రెడ్డి పాల్గొన్నారు.