కేంద్రంలోని బీజేపీ సర్కారు రైతాంగానికి వ్యతిరేకమని, రైతు అనుకూల ప్రభుత్వాన్ని తెచ్చుకునేందుకు పోరాడుదామని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి నిరంజన్రెడ్డి పిలుపునిచ్చారు. దేశ రైతాంగాన్ని జాగృతం చేయాలని, ఇందుకోసం తెలంగాణ రైతులే బాటలు వేయాలన్నారు. రైతుబంధు సమితిలు, రైతు నాయకులతో శనివారం ఆయన నిర్వహించిన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు.
సీఎం కేసీఆర్ గారి నాయకత్వంలో దేశ రైతాంగాన్ని జాగృతం చేద్దామని చెప్పారు. తెలంగాణ ఒక వ్యవసాయిక రాష్ట్రమని, అనతికాలంలోనే వ్యవసాయంలో అగ్రగామిగా ఎదిగిందన్నారు. దురదృష్టవశాత్తు దేశంలో ఒక గుడ్డి ప్రభుత్వం ఉన్నదని, వరి ధాన్యం కొనుగోలుకు కేంద్రం నిరాకరిస్తున్నదని మండిపడ్డారు.ఈ విషయం ముందే గ్రహించి రాష్ట్ర రైతాంగాన్ని జాగృతం చేశామని చెప్పారు.
ప్రభుత్వ విజ్ఞప్తిని గమనించి కొంతమంది రైతులు వరి సాగును ఆపేశారన్నారు. అయినా కొంతమంది రైతులు వరి వేశారన్నారు. తెలంగాణలోని 12,600 గ్రామ పంచాయతీలు ఈ యాసంగి ధాన్యం కొనాలని డిమాండ్ చేస్తూ కేంద్రానికి లేఖలు పంపాయన్నారు. అయినా, కేంద్రం ధాన్యం కొనుగోలుకు నిరాకరిస్తున్నదని మండిపడ్డారు. తెలంగాణలో పండిన ప్రతి గింజా కొనేదాకా పోరాడుదామన్నారు.