హైదరాబాద్, జూన్ 22 (నమస్తే తెలంగాణ): వ్యవసాయశాఖ సేవలు రైతులకు ఏవిధంగా అందుతున్నాయో తెలుసుకోవడంతో పాటు వారి సలహాలు, సూచనలు స్వీకరించేందుకు వ్యవసాయశాఖ ప్రత్యేకంగా కాల్సెంటర్ను ఏర్పాటు చేసింది. నాంపల్లి పబ్లిక్గార్డెన్లోని రైతుబంధు సమితి కార్యాలయంలో ఏర్పాటుచేసిన కాల్సెంటర్ను బుధవారం వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్రెడ్డి, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు పల్లా రాజేశ్వర్రెడ్డి, ఎమ్మెల్సీ ఎల్ రమణ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కాల్సెంటర్ ద్వారా రైతులతో నేరుగా మాట్లాడి రైతుబంధు, రైతుబీమా, పంటల వైవిధ్యీకరణపై వివరాలు తెలుసుకొంటామని, సమస్యలు పరిష్కరిస్తామని చెప్పారు. వ్యవసాయశాఖ వద్ద 63 లక్షల మంది రైతుల ఫోన్ నంబర్లు ఉన్నాయని, ఎంపికచేసిన రైతులతో కాల్ సెంటర్ సిబ్బంది ప్రతిరోజూ మాట్లాడుతారని తెలిపారు. రైతులు తమ సమస్యలను తెలిపేందుకు, పంట సాగుపై సందేహాలు నివృత్తి చేసుకొనేందుకు త్వరలో టోల్ఫ్రీ నంబర్ను అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు. కాల్ సెంటర్ను ప్రారంభించిన అనంతరం ఆయన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కాకర్ల క్లస్టర్ పరిధిలో ఇటీవల మరణించిన రైతు వెంకటేశ్వర్లు కుమారుడు రవీంద్రబాబును పరామర్శించారు. కార్యక్రమంలో వ్యవసాయశాఖ కార్యదర్శి రఘునందన్రావు, ప్రత్యేక కమిషనర్ హన్మంతు తదితరులు పాల్గొన్నారు.