హైదరాబాద్, నవంబర్ 17 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పోడుభూముల సర్వేను పారదర్శకంగా త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఆదేశించారు. పోడు భూముల పట్టాలను వచ్చే నెలలో లబ్ధిదారులకు పంపిణీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలిపారు. గురువారం హైదరాబాద్ డీఎస్ఎస్ భవన్లోని తన కార్యాలయంలో మంత్రి ఐటీడీఏ పీఈవోలతో పోడు భూముల సర్వే పనుల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా పోడుభూముల పర్యవేక్షణ అధికారులకు ట్యాబ్లను అందజేశారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో మెరుగైన ఫలితాలను రాబట్టేందుకు, సంక్షేమ పథకాలు, అభివృద్ధి, పోడుభూముల సర్వే కార్యక్రమాల తీరుతెన్నులను ఎప్పటికప్పుడు పరిశీలించి పర్యవేక్షణలో వేగం పెంచేందుకు ఈ ట్యాబ్ లు ఉపయోగపడతాయన్నారు. విజ్ఞాపనల వెరిఫికేషన్, సర్వేను వెంటనే పూర్తి చేయడానికి అదనపు బృందాలను ఏర్పాటు చేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ గిరిజనులకు అన్యాయం జరగవద్దన్నారు. పోడు భూముల సర్వేతోపాటు గ్రామీణ రోడ్ల మరమ్మతులపై దృష్టిసారించాలని ఆదేశించారు. ‘గిరి’వికాసం పథకాన్ని రైతులు సద్వినియో గం చేసుకొనేలా చూడాలన్నారు. సమావేశంలో గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జెడ్ చొంగ్తూ, స్పెషల్ సెక్రటరీ శ్రీధర్, అడిషనల్ డైరెక్టర్ సర్వేశ్వర్రెడ్డి, ట్రైకార్ మేనేజర్ శంకర్రావు, ఉట్నూరు పీవో వరుణ్రెడ్డి, భద్రాచలం పీవో గౌతమ్ పోట్రూ , ఏటూరు నాగారం పీవో అంకిత్, మన్ననూర్ పీవో ఉదయ్ తదితరులు పాల్గొన్నారు.