హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ): జీసీసీలో మానవీయ కోణంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కారుణ్య నియామకాలు చేపట్టారని రాష్ట్ర స్త్రీ, శిశు, గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరాబాద్ మాసబ్ ట్యాంక్ సంక్షేమ భవన్లోని జీసీసీ కార్యాలయంలో (గిరిజన సహకార సంస్థ) 30 మందికి ఆమె కారుణ్య నియామక పత్రాలను అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ జీసీసీ ఉద్యోగులు సంస్థ పురోభివృద్ధికి తోడ్పాటును అందిచాలని సూచించారు. ఇప్పటికే జీసీసీ ఉత్పత్తులకు మంచి ఆదరణ లభిస్తున్నదని, సంస్థ బ్రాండ్ ఇమేజ్ను మరింత పెంచాలని దిశా నిర్దేశం చేశారు. జీసీసీని నమ్ముకొని విధుల్లో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సీఎం కేసీఆర్ అండగా ఉన్నారని, అందులో భాగంగానే మానవీయ కోణంలో ఆ కుటుంబాల నుంచి అర్హులైన వారికి ఉద్యోగావకాశాలు కల్పించారని తెలిపారు. కార్యక్రమంలో జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, గిరిజన సంక్షేమశాఖ కార్యదర్శి క్రిస్టినా జడ్ చొంగ్తూ, గిరిజన సంక్షేమశాఖ అదనపు సంచాలకుడు సర్వేశ్వర్రెడ్డి, జీసీసీ జీఎం సీతారాంనాయక్, చీఫ్ ఇంజినీర్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు.