అచ్చంపేట ( నాగర్ కర్నూల్) : ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) చేపడుతున్న సంక్షేమ , అభివృద్ధి కార్యక్రమాల వల్ల గిరిజనులకూ స్వర్ణ యుగం వచ్చిందని రాష్ట్ర గిరిజన అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్(Minister Satyavati Rathode) అన్నారు.
నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని మన్ననుర్, గిరిజన తండాల్లో పర్యటించి 85.5 కోట్ల అభివృద్ధి పనులకు శంఖుస్థాపనలు, గిరిజనుల జీవనోపాధికి గాను 250 కుటుంబాలకు ఒక్కో కుటుంబానికి లక్ష రూపాయల విలువ చేసే యూనిట్లను అందజేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 67 సంవత్సరాలు పాలించిన ప్రభుత్వాలు ఒక ఎత్తు అయితే కేవలం 9 సంవత్సరాల తెలంగాణ పరిపాలన ఒక ఎత్తు అన్నారు. నిరుపేదల ఆడపిల్లల వివాహానికి ప్రభుత్వం లక్ష నూట పదహారు కల్యాణలక్ష్మి(Kalyana Laxmi) ద్వారా ఆదుకుంటునారని పేర్కొన్నారు. చెంచులు, గిరిజనుల కోసం పల్లె దవాఖానాలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు.
రాష్ట్రంలో 25 నియోజక వర్గాల్లో సేవాలాల్ గిరిజన భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరు చేశామని వెల్లడించారు . తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్ (Reservations)ను 6 నుంచి 10 శాతానికి పెంచిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు తదితరులు పాల్గొన్నారు.