చెన్నారావుపేట, నవంబర్26: సీఎం కేసీఆర్ గిరిజన తండాలను గ్రామ పంచాయతీలుగా మార్చి గిరిజనులకు స్వయం పరిపాలనకు అవకాశం కల్పించిన మహా నేత అని గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ కొనియాడారు. ఆదివారం వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పుల్లాయ బోడుతండా వద్ద నర్సంపేట బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి పెద్ది సుదర్శన్రెడ్డి తరఫున జరిగిన ప్రచారంలో ఆమె ప్రసంగించారు. మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే గిరిజన బంధు పథకం ద్వారా గిరిజనుల అభ్యున్నతికి కృషి చేస్తారని తెలిపారు. నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి గిరిజన పక్షపాతి అని, ఆయన నియోజకవర్గంలోని గిరిజనుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. తండాల్లో ఎన్నో సీసీ, బీటీ లింక్ రోడ్లను వేయించారని తెలిపారు. అలాగే ప్రతి తండాకు మిషన్ భగీరథ ద్వారా మంచినీటిని అందించారని, 24 కరెంట్ ఇస్తున్నామని తెలిపారు.