మహబూబాబాద్ : వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, మూడు గంటలు కరెంటు ఇస్తే సరిపోతుందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీ దిగజారుడుతానానికి నిదర్శనం. రేవంత్ రెడ్డి రైతు వ్యతిరేక ద్రోహి అని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ఫైర్ అయ్యారు. గురువారం ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం అన్నారు.
రేవంత్ రెడ్డికి ఇష్టమొచ్చిన వ్యాఖ్యలు చేయడం, మాయమాటలు చెప్పడం పరిపాటిగా మారింది. కాంగ్రెస్ హయాంలో ఏనాడైనా 24 గంటల ఉచిత నిరంతర విద్యుత్ ని ఇచ్చారా ? అని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వ్యవసాయానికి సాగునీరు, 24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నారని గుర్తు చేశారు.
కర్ణాటకలో గెలుపు చూసి తెలంగాణలో రేవంత్ రెడ్డి పగటి కలలు కంటున్నడని, పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రేవంత్ రెడ్డి ప్రవర్తిస్తున్నాడని ఎద్దేవా చేశారు. రైతు ఎన్ని గంటలు నీరు పారిస్తే ఎన్ని ఎకరాలకు నీరు పారుతుందో రేవంత్ రెడ్డికి కనీస అవగాహన లేదు. కాంగ్రెస్ హయాంలో రైతులు పడ్డ కష్టాలు మరిచిపోయి గజినీలా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇప్పటికకైనా రేవంత్ రెడ్డి తన వైఖరి మార్చుకోకుంటే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు.