అయిజ, ఆగస్టు 15 : వానకాలం ప్రారంభమై రెండునెలలు పూర్తయినా సకాలంలో వరుణుడు కరుణించకపోవడంతో రైతులు, పశుపక్షాదులు అల్లాడుతున్నాయి. దేవుళ్లను వేడుకుంటున్నా కరుణించకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు. శ్రావణమాసం మొదటి శనివారం కృష్ణా, తుంగభద్ర నదీజలాలతో పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామికి అభిషేకించి ప్రత్యేక పూజలు చేశారు.
పట్టణంలోని పెద్ద ఆంజనేయస్వామి ఆలయం నుంచి పట్టణానికి సమీపంలోని స్వయంభూ కట్టకింద తిమ్మప్పస్వామి ఆలయం వరకు 11 జతల ఎడ్లబండ్లపై నదీజలాలను భాజా భజంత్రీలు, మేళ తాళాలు, భక్తులు భక్తి గీతాలు ఆలపిస్తూ ఊరేగింపుగా తీసుకొచ్చారు. ఇప్పటికే సాగు చేసిన పంటలు ఎండు దశకు చేరుకుంటుండగా, యాసంగిలోనై పంటల సాగుకు కరుణించవయ్యా అంటూ వరుణుడికి భక్తులు పూజలు చేశారు. కార్యక్రమంలో రైతులు, ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు పాల్గొన్నారు.