న్యూఢిల్లీ: సృష్టికి మూలమైన మహిళ తన హక్కుల కోసం ఇంకా పోరాడటం శోచనీయమని మంత్రి సత్యవతి రాథోడ్ (Minister Satyavathi Rathod) అన్నారు. మహిళలు అభివృద్ధిలో, పరిపాలనలో భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైంది కాదని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు రిజర్వేషన్లు (Women’s Reservation Bill) అమలు చేయాలనే డిమాండ్తో భారత జాగృతి (Bharat Jagruthi) అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద చేస్తున్న దీక్షలో మంత్రి సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. మహిళా బిల్లుకు మద్దతు ప్రకటించిన బీజేపీకి అవకాశం ఇచ్చి ఎనిమిదేండ్లు దాటిపోయిందని, ఇంకా బిల్లు మాత్రం లోక్సభ ముందుకు రాలేదని విమర్శించారు. ఇప్పటికైనా బీజేపీ కళ్లు తెరవాలని ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేయాలని డిమాండ్ చేశారు.
తమ పదవులు కాపాడుకోవడానికే మహిళా రిజర్వేషన్ బిల్లును రాకుండా అడ్డుకుంటున్నారని విమర్శించారు. మహిళలను వంటిల్లు దాటకుండా చూడాలనే భావన సరైనది కాదన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలో అన్ని రకాలుగా రిజర్వేషన్లు కల్పించిన ఘనత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్దేనని (CM KCR) స్పష్టం చేశారు. సీఎం కేసీఆర్ నాయకత్వం బంజారాలకు స్వర్ణయుగమని చెప్పారు. బంజారాలకు ఆత్మగౌరవ భవనాలు నిర్మించారని వెల్లడించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందే వరకు వామపక్ష పార్టీల మద్దతు ఉంటుందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (Sitaram Yechury) అన్నారు. మహిళా రిజర్వేషన్ కోసం చేసే పోరాటంలో పాల్గొంటామని ప్రకటించారు. మహిళలకు భాగస్వామ్యం లేనంత వరకు సమాజం ముందుకు పోదని చెప్పారు. ఎన్నో అడ్డంకుల తర్వాత మహిళా రిజర్వేషన్ బిల్లు రాజ్యసభలో ఆమోదం పొందింది, కానీ లోక్సభ ఆమోదముద్ర వేయలేదని చెప్పారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ఆమోదించాలని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. పార్లమెంటులో మెజార్టీ ఉన్న మోదీ సర్కార్ మహిళా బిల్లుపెట్టకపోవడం సిగ్గుచేటని మహబూబాబాద్ ఎంపీ మాలోత్ కవిత విమర్శించారు.