హైదరాబాద్ : మాజీ రాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి ( సెప్టెంబర్ 5 )ని పురస్కరించుకుని, నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులందరికీ రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ శుభాకాంక్షలు తెలిపారు.
విద్య ద్వారానే మానవ వనరులు అభివృద్ధి అవుతాయని, మానవ వనరుల ద్వారానే బంగారు తెలంగాణ సాధించవచ్చనే గొప్ప లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణలో విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నారని మంత్రి సత్యవతి పేర్కొన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అత్యధిక గురుకులాలు పెట్టి, నాణ్యమైన విద్యను అందిస్తున్నారు అని తెలిపారు.
కోవిడ్ -19 సందర్భంగా దాదాపుగా ఏడాదిన్నర కాలంగా విద్యాసంస్థలు మూతబడ్డాయి. ఈ క్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ నెల నుంచే విద్యాలయాలు పునఃప్రారంభమైనందున కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, విద్యార్థుల ఆరోగ్యాన్ని పరిరక్షిస్తూ, విద్యను అందించాలన్నారు.