యాదాద్రి: ఉపఎన్నికల్లో విజయం ద్వారా మునుగోడు ప్రజలు టీఆర్ఎస్పై తమకున్న అభిమానాన్ని మరోసారి చాటారని మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. పార్టీ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించినందుకు మునుగోడు ఓటర్లకు రుణపడి ఉంటామని చెప్పారు. సోమవారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి యాదాద్రి శ్రీ లక్ష్మీనారసింహ స్వామివారిని మంత్రి సత్యవతి దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు మూడున్నరేండ్లలో అభివృద్ధికి నోచుకోని మునుగోడు నియోజకవర్గాన్ని అద్భుతంగా తీర్చిదిద్దేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు.
దొంగ ప్రమాణాలు చేసిన బీజేపీ నాయకులకు లక్ష్మీనరసింహ స్వామి తగిన బుద్ధి చెప్పారని వెల్లడించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చూపిన సంకల్పంతో దేశంలో అన్ని రాష్ట్రాలలో గొప్ప అభివృద్ధిని తీసుకురావడం ఖాయమన్నారు. కేసీఆర్తోనే దేశంలో గిరిజనులు, దళితులు, రైతులు, మహిళలు సుభిక్షంగా ఉంటారని స్పష్టం చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 12 నియోజకవర్గాల్లో టీఆర్ఎస్ పార్టీని ఆదరించిన ప్రజలందరికీ మంత్రి సత్యవతి ధన్యవాదాలు తెలిపారు.