మహబూబాబాద్ : దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా వారి సొంత కాళ్లపై నిలబడాలని కోరుకుంటారని, వారికి కాస్త చేయూతనిస్తే ఎన్నో విజయాలు సాధిస్తారని మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. వచ్చే నెల 3వ తేదీన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకొని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వహించిన జిల్లాస్థాయి దివ్యాంగుల క్రీడా పోటీలను సత్యవతి రాథోడ్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ.. దివ్యాంగుల సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తుందని చెప్పారు. దివ్యాంగులను క్రీడల్లో సైతం ప్రోత్సాహిస్తూ, వారి ఆత్మగౌరవాన్ని మరింత పెంచుతున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఏటా రూ. 18 వందల కోట్లు ఖర్చు చేస్తూ ,రాష్ట్రంలో సుమారు 5 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నామని తెలిపారు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా దివ్యాంగులకు రూ. 3,016 పింఛన్ ఇవ్వట్లేదని గుర్తు చేశారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు అందిస్తున్న ప్రోత్సాహాన్ని, అవకాశాలను అందిపుచ్చుకుని జీవితంలో మరింత ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ జిల్లా మంత్రిగా మీ మధ్యలో పుట్టి, పెరిగిన బిడ్డగా, నావంతుగా చేతనైనంత సహాయం అందించడానికి ఎల్లప్పుడు ముందుంటాను అని మంత్రి స్పష్టం చేశారు. దివ్యాంగులు జీవితంలో ఆత్మస్థైర్యంతో జీవించే విధంగా మనో ధైర్యాన్ని భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని సత్యవతి రాథోడ్ స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా జడ్పీ చైర్ పర్సన్ అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక ఇతర అధికారులు, తదితరులు పాల్గొన్నారు.