ఉప్పల్, జూన్ 22: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దేశాన్ని తాకట్టు పెట్టేలా వ్యవహరిస్తున్నదని మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మండిపడ్డారు. నాచారంలోని తెలంగాణ ఫుడ్స్ ప్రాంగణంలో రూ.5 కోట్లతో ఏర్పాటుచేసిన గోదామును మంత్రి మల్లారెడ్డి, ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డితో కలిసి బుధవారం ప్రారంభించారు. దేశ రక్షణకు ప్రాణాలు తెగించి పోరాడే సైనికులను అగ్నిపథ్ పథకంతో కాంట్రాక్టు కార్మికులుగా మారుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా నిరుద్యోగుల డిమాండ్లను కేంద్రం పట్టించుకోవడంలేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. సైన్యం ప్రతిష్ఠను దిగజార్చేలా కుట్ర చేస్తున్నదని పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఒకటి నుంచి 6 సంవత్సరాల చిన్నారులకు, గర్భిణులకు, బాలింతలకు తెలంగాణ పుడ్స్ ద్వారా పౌష్టికాహారం అందుతుందని మంత్రి సత్యవతి వెల్లడించారు.