ములుగు : జిల్లాలోని భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ పునరుద్ధరణ, పనులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముందుగా బండారుపల్లిలోని రాళ్లకుంట వాగు వద్ద రోడ్డు పనులు పరిశీలించారు. అనంతరం బూర్గంపేట వద్ద రోడ్డు పనులను పరిశీలించి అధికారులకుమంత్రి పలు సూచనలు చేశారు. అనూహ్యంగా కురిసిన భారీ వర్షాలకు బూర్గంపేట చెరువు కట్ట తెగడంతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు మృతి చెందారు.
వారిని కలిసేందుకు బయలుదేరిన మంత్రికి రోడ్డు కనెక్టివిటీ లేకపోవడంతో సిబ్బంది అభ్యంతరం చెప్పారు. వారికి నచ్చ చెప్పిన మంత్రి స్వయంగా నడుచుకుంటూ వెళ్లి ఆ కుటుంబ సభ్యులను కలసి వారిని ఓదార్చరు. ప్రకృతి విలయతాండవం వల్ల ఇలాంటి పరిస్థితులు వచ్చాయని, కుటుంబ సభ్యులను కోల్పోవడం దురదృష్టకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం అన్నివిధాలుగా ఆదుకుంటుందని, ధైర్యంగా ఉండాలని అన్నారు. నడవడానికే కష్టతరంగా ఉన్నా, వరదలు సైతం ఏమాత్రం లెక్క చేయకుండా మంత్రి వాగులు దాటుకుని వచ్చి తమకు అండగా నిలిచారని స్థానికులు సైతం సంతోషం వ్యక్తం చేశారు. మంత్రి సత్యవతి రాథోడ్కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు.