మహబూబాబాద్ : స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ ఉద్యమ నేత, బడుగు బలహీన వర్గాల స్ఫూర్తి ప్రదాత కొండా లక్ష్మణ్ బాపూజీ(Konda Laxman Bapuji) అని రిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi Rathod) అన్నారు. కొండా లక్ష్మణ్ బాపూజీ108వ జయంతి సందర్భంగా కలెక్టరేట్ కార్యాలయంలో బాపూజీ చిత్రపటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మాజీ మంత్రి, తెలంగాణ పోరాటయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ, తెలంగాణ సమాజానికి చేసిన సేవలు మరువలేనివన్నారు. తొలి, మలిదశ తెలంగాణ పోరాటంలో ఆయన ఎంతో చురుగ్గా పాల్గొన్నారని గుర్తు చేశారు. తన జీవిత కాలమంతా అట్టడుగు వర్గాల అభ్యున్నతి కోసం పరితపించిన గొప్ప నాయకుడు బాపూజీ అన్నారు. ఆమహనీయుడి సేవలు తెలంగాణకే గర్వకారణమని మంత్రి సత్యవతి పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ కుమారి అంగోత్ బిందు, జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యే బానోతు శంకర్ నాయక్, ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు, మున్సిపల్ చైర్మన్ పాల్వాయి రామ్మోహన్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రసన్న రాణి, మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ బలరాం నాయక్, ట్రైబల్ వెల్ఫేర్ డీడీ ఎర్రయ్య, ఆర్సీవో రాజ్యలక్ష్మి, ఈఈ హేమలత, డీసీహెచ్ఎస్ వెంకట్ రాములు, ఇతర అధికారులు పాల్గొన్నారు.