జయశంకర్ భూపాలపల్లి, నవంబర్ 9(నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీ(Congress) రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా అని రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్(Minister Sathyavathi) ప్రశ్నించారు. గురువారం భూపాలపల్లి అసెంబ్లీ స్థానానికి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గండ్ర వెంకటరమణారెడ్డి నామినేషన్ వేయగా ఆయనతో పాటు మంత్రి సత్యవతి రాథోడ్, మాజీ స్పీకర్, ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి, నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జి బస్వరాజు సారయ్య, పార్టీ జిల్లా అధ్యక్షురాలు గండ్ర జ్యోతిలు నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం జిల్లా కేంద్రంలోని జయశంకర్ చౌక్లో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో వారు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి సత్యవతి మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఆరు హామీలతో తెలంగాణలో ప్రచారం నిర్వహిస్తున్నదని, ఈ ఆరు హామీలు కేవలం తెలంగాణ రాష్ర్టానికి మాత్రమే వర్తిస్తాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా అమలు చేయని హామీలను తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తారా? ఆ పార్టీ రాష్ట్ర పార్టీనా.. జాతీయ పార్టీనా.. సిగ్గు, శరం ఉందా… అని మండిపడ్డారు.
కేవలం తెలంగాణపైనే ఈ కపట ప్రేమ కనబరుస్తున్నారని.. ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. భూపాలపల్లిలో గండ్ర వెంకటరమణారెడ్డిని అధిక మెజార్టీతో గెలిపించి సీఎంకు కానుకగా ఇద్దామన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ జక్కు శ్రీహర్షి, మాజీ జడ్పీ చైర్మన్ సాంబారి సమ్మారావు, మున్సిపల్ చైర్పర్సన్ సెగ్గం వెంకటరాణి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ బుర్ర రమేశ్ పాల్గొన్నారు.