మహబూబాబాద్: మంత్రిగా తనకు రాష్ట్రం అంతా ఒక ఎత్తు అయితే, తన నియోజక వర్గం డోర్నకల్ ఒక ఎత్తు అని, ఇక్కడి ప్రజలు అభివృద్ధి కోసం ఆశగా ఎదురుచూస్తున్నారని, వారి ఆశలు నెరవేర్చే విధంగా అందరం కలిసి పనిచేస్తామని రాష్ట్ర గిరిజన, స్త్రీ-శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. ఆమె పుట్టిన రోజు సందర్భంగా మహబూబాబాద్ జిల్లా, మరిపెడలో ఏర్పాటు చేసిన వేడుకల్లో సత్యవతి రాథోడ్ పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి, మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన పుట్టిన రోజు సందర్భంగా గౌరవ పెద్దలు, తనకు అత్యంత ఆప్తులు, దైవ సమానులు, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారని చెప్పారు. ఈ క్రమంలో ఆయనకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. గౌరవనీయులు, పెద్దలు రాష్ట్ర గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్, తాను బాగా అభిమానించే కేటీఆర్, సంతోష్, కల్వకుంట్ల కవిత, మంత్రి శ్రీ దయాకర్ రావు, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నాయకులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలపడం అత్యంత సంతోషంగా ఉందని, అందరికీ కృతజ్ణతలు చెప్పారు.
గౌరవ ముఖ్యమంత్రి రెండున్నరేళ్ల క్రితం డోర్నకల్కు వచ్చినప్పుడు కాళేశ్వరం నీళ్లు ఇస్తానని మాట ఇచ్చారని, దాని ప్రకారం డోర్నకల్కు కాళేశ్వరం నీళ్లు వస్తున్నాయని, అనేక అభివృద్ధి పనులు జరుగుతున్నాయని మంత్రి తెలిపారు. ‘మా బిడ్డలు ఒకే పార్టీలో, ఒకే ప్రభుత్వంలో ఎమ్మెల్యేగా పెద్దలు రెడ్యా నాయక్, ఎంపీగా కవిత, మంత్రిగా నేను ఉన్నాను. కాబట్టి ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడూ అభివృద్ధి కాదు అన్న ఆచోలనలో, ఆశతో ఇక్కడి ప్రజలు ఉన్నారు‘ అని అన్నారు. తాను, రెడ్యా నాయక్ 20 ఏళ్లుగా ఒకరికొకరు తలపడి, వేర్వేరు పార్టీలో ఉన్నా, అధికార, ప్రతిపక్షాలలో కొనసాగినా, ఇప్పుడు ఒకే పార్టీలో ఉన్నామని, కాబట్టి ఇక్కడ అన్ని రకాల అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.
ప్రజల ఆశల మేరకు పని చేసే బాధ్యత మాకుందన్నారు. ప్రజలు కోరుకుంటున్న విధంగా అందరం కలిసి పనులు చేస్తామని హామీ ఇస్తున్నానని చెప్పారు. మరిపెడలో తన జన్మదినోత్సవం సందర్భంగా కార్యక్రమం ఏర్పాటు చేసిన నాయకులు, పెద్దలు శ్రీనివాసరెడ్డి, నర్సింహ్మరెడ్డి, రవీందర్ రెడ్డి, అశోక్, నరేష్ రెడ్డి, రామ్ లాల్, ఉపేందర్, అంబరీష్, అప్సర్, అఫ్జల్ అందరికీ ధన్యవాదాలు తెలిపారు.