రంగారెడ్డి : రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉదయం తుక్కుగూడ మున్సిపాలిటీలో పర్యటించారు. అక్కడ పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం స్థానిక కూరగాయల మార్కెట్ను మంత్రి సందర్శించారు. అయితే ఓ బాలుడు కూరగాయాలు విక్రయించడాన్ని సబిత గమనించారు.
దీంతో ఆ బాలుడి వద్దకు చేరకున్న సబితా ఇంద్రారెడ్డి.. బడికి ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. కాలికి నొప్పి అయిందని చెప్పగా.. ఎక్కడ అని అడిగారు. డాక్టర్ వద్దకు వెళ్దామా అని విద్యార్థిని అడిగి, ఏ స్కూల్ అని ప్రశ్నించారు. సదరు విద్యార్థి మహేశ్వరం మోడల్ స్కూల్ అని బదులివ్వగా.. అంత మంచి స్కూల్ కదరా.. ఎందుకు వెళ్లలేదు? అని అడిగారు. అయితే చదువుకున్న ప్రాధన్యతను పిల్లలకు వివరించాలని మంత్రి అక్కడున్న తల్లిదండ్రులకు సూచించారు. పిల్లలకు బడికి వెళ్లేలా చూడాలని సబితా ఇంద్రారెడ్డి తల్లిదండ్రులను కోరారు.