రంగారెడ్డి, నమస్తే తెలంగాణ/శంషాబాద్ రూరల్, ఏప్రిల్ 13: జీవో 111ను ఎత్తివేస్తూ రాష్ట్ర క్యాబినెట్ తీసుకొన్న నిర్ణయంపై రంగారెడ్డి జిల్లా పరిధిలోని 84 గ్రామాల్లో బుధవారం సంబురాలు మిన్నంటాయి. 25 ఏండ్లుగా ఎదుర్కొంటున్న కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారంటూ.. టపాసులు పేల్చి, స్వీట్లు తినిపించుకొంటూ ఆనందాన్ని పంచుకొన్నారు. మంత్రి సబితాఇంద్రారెడ్డి సైతం సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు.
మొయినాబాద్లో నిర్వహించిన సంబురాల్లో చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య, శంకర్పల్లి మండలం జన్వాడలో టీఆర్ఎస్ నేత పీ కార్తీక్రెడ్డి.. కేసీఆర్ చిత్రపటానికి పాలతో అభిషేకం చేశారు. శంషాబాద్ పట్టణంలో టీఆర్ఎస్ నాయకుడు దూడల వెంకటేశ్గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంబురాల్లో చేవెళ్ల ఎంపీ డాక్టర్ రంజిత్రెడ్డి, రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ పాల్గొని సీఎం కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు జీవో 111ను ఎత్తివేశారన్నారు. ఈ సందర్భంగా వారు రైతులు, ప్రజల పక్షాన సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం 111 జీవోను ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకోవడంతో చేవెళ్ల మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. బుధవారం మొయినాబాద్ మండలంలోని కనకమామిడి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వంద కొబ్బరికాయలు కొట్టారు. 111 జీవోను రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయగానే మిగతా 900 కొబ్బరికాయలు కొడతానని తెలిపారు.