హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ) : పదోతరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు పూర్తిచేయాలని విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 3 నుంచి 13 వరకు నిర్వహించనున్న పదోతరగతి పరీక్షల ఏర్పాట్లపై మంత్రి బుధవారం హైదరాబాద్ సైఫాబాద్లోని పాఠశాల విద్యాశాఖ డైరెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విద్యార్థులు ఎలాంటి ఒత్తిడి, ఆందోళనకు గురికాకుండా పరీక్షలకు సంసిద్ధం కావాలని మంత్రి సూచించారు. పరీక్షలపై విద్యార్థులకున్న సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసి, వారిలో మనోధైర్యాన్ని నింపాల్సిన బాధ్యత యాజమాన్యాలు, టీచర్లు, తల్లిదండ్రులపై ఉన్నదని గుర్తుచేశారు. మొత్తం 4,94,620 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారని, ఇందుకు 2,652 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. పరీక్షలు రాసే విద్యార్థులు హాల్టికెట్ చూపిస్తే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యాన్ని కల్పించినట్టు మంత్రి తెలిపారు.
సైన్స్కు విడివిడిగా
ఈ యేడాది నుంచి పరీక్షా పేపర్లను 6కు కుదించామని, ఒక్క సైన్స్లో మాత్రం భౌతికశాస్త్రం, జీవశాస్ర్తాల ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలను విడివిడిగా అందిస్తామని మంత్రి చెప్పారు. కేంద్రాల్లో విద్యుత్తు ఆటంకం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఈ సమీక్ష లో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ సంచాలకురాలు శ్రీ దేవసేన, పరీక్షల విభాగం డైరెక్టర్ జీ రమేశ్ ఉన్నారు.