రంగారెడ్డి : ఒక యజ్ఞంలా సీఎం కేసీఆర్ మన ఊరు- మన బడి, మన బస్తీ-మన బడికి శ్రీకారం చుట్టారని విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. కొత్తూర్ మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్, కొత్తూరు ప్రభుత్వ పాఠశాలలో మన ఊరు – మన బడి, మన బస్తీ- మన బడి కార్యక్రమంలో భాగంగా మంజూరైన పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. రాష్ట్ర వ్యాప్తంగా రూ.7,289 కోట్ల భారీ బడ్జెట్ తో 26 వేల పాఠశాలల్లో 12 రకాల పనులు చేపడుతున్నామన్నారు. చాలా వరకు ప్రైవేట్ పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఉండటంతో తల్లిదండ్రులు మొగ్గు చూపుతుండటంతో సీఎం కేసీఆర్ ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సంవత్సరం నుంచి ఆంగ్ల బోధనకు ఆదేశాలు ఇచ్చారని తెలిపారు.
విద్యా శాఖలో తీసుకుంటున్న సంస్కరణలు, మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల నమోదు భారీగా పెరిగిందన్నారు. సీఎం కేసీఆర్ వెయ్యి కి పైగా గురుకులాలు ప్రారంభించారు. ఒక్కో విద్యార్థి పై ప్రభుత్వం రూ. లక్షా 25 వేలు ఖర్చు చేస్తుందన్నారు. కార్యక్రమంలో జడ్పీ చైర్ పర్సన్ అనితా రెడ్డి ,వైస్ చైర్మన్ గణేష్, ఎమ్మెల్యే అంజయ్య యాదవ్, తదితరులు పాల్గొన్నారు.