వచ్చే విద్యాసంవత్సరం నుంచి రాష్ట్రంలోని 1 నుంచి 8 తరగతుల్లోని విద్యార్థులకు ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శాసనసభలో వెల్లడించారు. 2023 -24 విద్యాసంవత్సరంలో 9వ తరగతి, 2024 -25 విద్యా సంవత్సరం నుంచి 10వ తరగతుల్లో ఇంగ్లీష్ మీడియం విద్యాబోధనను ప్రారంభించనున్నామన్నారు. కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయాల మేరకు విద్యాశాఖకు ఆదేశాలిచ్చామన్నారు. శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో మన ఊరు మన బడి – మన బస్తీ మన బడి కార్యక్రమంపై ఎమ్మెల్యేలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానాలిచ్చారు. ఇంగ్లీష్ మీడియాన్ని విప్లవాత్మక మార్పుగా సబితా ఇంద్రారెడ్డి అభివర్ణించారు. తాజా పరిస్థితుల్లో ఇంగ్లీష్ మీడియం హోదాకు చిహ్నంగా మారిందని, ఈ మీడియంలో చదివితేనే ఉద్యోగాలొస్తాయన్న భావన సమాజంలో నెలకొన్నదన్నారు. రెక్కాడితే కానీ డొక్కాడని తల్లిదండ్రులు సైతం కడుపుకట్టుకుని తమ పిల్లలను ఇంగ్లీష్ మీడియం చదువుల కోసం ప్రైవేట్ స్కూళ్లకు పంపిస్తున్నారని.. అందరి ఆకాంక్ష మేరకు ఇంగ్లీష్ మీడియాన్ని సర్కారు స్కూళ్లల్లో ప్రారంభిస్తున్నామన్నారు. ఇందుకోసం ద్విభాషా పుస్తకాలను సిద్ధంచేశామని, ఈ నెల 14వ తేదీ నుంచి టీచర్లకు శిక్షణనివ్వనున్నామన్నారు.
సీఎం కేసీఆర్ నాయకత్వంలో ఈ నెల 8వ తేదీన విద్యాయజ్ఞానికి శ్రీకారం చుట్టామని మంత్రి సభకు వివరించారు. మన ఊరు మన బడి -మన బస్తీ మన బడి కార్యక్రమం ద్వారా విద్యాయజ్ఞం ప్రారంభమయ్యిందన్నారు. మండలం యూనిట్గా అత్యదిక విద్యార్థులు నమోదైన 9,123 స్కూళ్లను మొదటి దశలో ఎంపిక చేశామన్నారు. అసెంబ్లీ సమావేశాలు ముగియగానే ఎమ్మెల్యేలంతా తమ తమ నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలన్నారు. రూ. 2 లక్షలు విరాళాలిస్తే ఎస్ఎంసీ కమిటీలో సభ్యత్వం, రూ.10 లక్షల విరాళమిస్తే ఒక తరగతి గదికి, రూ. 25 లక్షలిస్తే ప్రాథమిక పాఠశాలకు, రూ. 50 లక్షలిస్తే ప్రాథమికోన్నత పాఠశాలకు, కోటి రూపాయాలిస్తే ఉన్నత పాఠశాలకు వారి పేర్లు లేదా దాతలు సూచించిన పేర్లను పెడతామన్నారు. ఎంపిక చేసిన స్కూళ్ల పేర్లను మార్చాల్సి వస్తే, సంబంధిత జిల్లాల మంత్రులను సంప్రదించాలని, రెండో దశలో ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని స్కూళ్లను ఎంపిక చేస్తామన్నారు. త్వరలోనే ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని, పాత విద్యాకమిటీలనే కొనసాగిస్తామని, మధ్యాహ్న భోజన పథకం బకాయిలను త్వరలోనే చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.