వికారాబాద్: గ్రంథాలయ శాఖలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) భారీ సంస్కరణలు తీసుకొచ్చారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabitha Indra Reddy) అన్నారు. పోటీ పరీక్షల అభ్యర్థులకు గ్రంథాలయాల్లో (Library) మెటీరియల్ అందుబాటులో ఉంచామని, డిమాండుకు అనుగుణంగా పస్తకాలను సిద్ధంగా ఉంచామని చెప్పారు. వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో నూతనంగా నిర్మించిన రీడింగ్ హాల్ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. వికారాబాద్ జిల్లా గ్రంథాలయంలో ఆధునిక సౌకర్యాలు కల్పిస్తూనే నూతనంగా రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లో డిస్ట్రిక్ట్ లైబ్రరీలను నిర్మించామన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా గ్రామ పంచాయతీల్లో రీడింగ్ రూమ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. చిన్నారులు, యువత, సీనియర్ సిటిజన్ల కోసం గ్రంథాలయాల్లో పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నామని తెలిపారు. రాష్ట్రంలోని అని ప్రభుత్వ పాఠశాలల్లో 10 వేల రీడింగ్ కార్నర్లను ఏర్పాటు చేస్తున్నామని, తెలంగాణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా ఈ నెల 20 విద్యా దినోత్సవం సందర్భంగా వాటిని ప్రారంభిస్తామన్నారు.