హైదరాబాద్, జనవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియను పక్కాగా, పారదర్శకంగా నిర్వహించాలని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయంలో మంగళవారం విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేనతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా బదిలీల మార్గదర్శకాలు, షెడ్యూల్, పదోన్నతులపై చర్చించారు. పూర్తి పారదర్శకత, జవాబుదారితనంతో, లోపాలకు తావులేకుండా పదోన్నతులు, బదిలీల ప్రక్రియను నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. మార్గదర్శకాలు, షెడ్యూల్పై త్వరితగతిన తుది నిర్ణయం తీసుకోవాలని సూచించారు. ఎలాంటి న్యాయపరమైన సమస్యలు తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు.
వెబ్కౌన్సిలింగ్..
ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియకు ప్రభుత్వం అనుమతినిచ్చినందున ఎలాంటి అవాంతరాలు తలెత్తకుండా అప్రమత్తంగా ఉండాలని మంత్రి సబిత పేరొన్నారు. వెబ్ కౌన్సిలింగ్ ద్వారా ఉపాధ్యాయ బదిలీలకు చర్యలు తీసుకుంటున్నందున ఇందుకోసం వినియోగించే సాఫ్ట్వేర్లో ఎలాంటి లోపాలు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని చెప్పారు. పదోన్నతులు, బదిలీల్లో ఏ ఒకరికి అన్యాయం జరగకూడదని, ఈ ప్రక్రియకు సంబంధించి చేస్తున్న ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలని సూచించారు. ఈ ప్రక్రియ సజావుగా సాగేందుకు రాష్ట్ర స్థాయి అధికారులను ఆయా జిల్లాల్లో పర్యవేక్షకులుగా నియమించాలని సూచించారు.