హైదరాబాద్ : ఔత్సాహిక పారిశ్రామికవేత్తలుగా ఎదగాలనుకునే విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. శనివారం ఉన్నత విద్యామండలిలో బాసర ట్రిపుల్ ఐటీపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. బాసర ట్రిపుల్ ఐటీలో చదువుకుంటున్న విద్యార్థులు అంతర్జాతీయ దిగ్గజ సంస్థల్లో ఉద్యోగ అవకాశాలు పొందే విధంగా చర్యలు చేపట్టాలని ఇంచార్జి వైస్ ఛాన్సలర్ను కోరారు. బాసర ట్రిపుల్ ఐటీలోని 150 మంది విద్యార్థులను హైదరాబాద్లోని టీ హబ్ సందర్శనకు తీసుకువచ్చి, వారిలో స్టార్టప్లకు రూపకల్పన చేసే విధంగా ప్రోత్సహించిన బాసర ట్రిపుల్ ఐటీ ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ వీ వెంకటరమణ, డైరెక్టర్ శ్రీ సతీష్ కుమార్ను అభినందించారు.
టీ హబ్ లోని అత్యాధునిక సౌకర్యాలను బాసర ట్రిపుల్ ఐటి విద్యార్థులందరూ అందిపుచ్చుకొనేలా ప్రణాళిక రూపొందించాలని మంత్రి ఇంచార్జి వైస్ ఛాన్సలర్ ను ఆదేశించారు. ఐటీ కోర్సులు పూర్తయ్యాక విద్యార్థుల ముందున్న అవకాశాలను విద్యార్థులు చదువుతున్న కోర్సుల అంతర్భాగంలోనే వివరించాలని మంత్రి సూచించారు. కొత్తగా బాసర ట్రిపుల్ ఐటిలో అడ్మిషన్ ప్రక్రియ మొదలవుతున్నందున తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అలాగే ప్రతిభావంతులైన విద్యార్థులను ఎంపిక చేసి మరి కొన్ని ప్రాంగణాలలో ఇంటర్న్షిప్ను కూడా ప్రొత్సహించేందుకు ప్రణాళికను తయారు చేసుకొవాలని సూచించారు. ఈ సమావేశంలో ప్రభుత్వ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్, తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, కార్యదర్శి సెక్రటరీ ఎన్ శ్రీనివాస రావు పాల్గొన్నారు.