హైదరాబాద్, నవంబర్ 18 (నమస్తే తెలంగాణ): నకిలీ సర్టిఫికెట్ల ముప్పును అరికట్టేందుకు స్టూడెంట్ అకడమిక్ వెరిఫికేషన్ సర్వీస్(ఎస్ఏవీఎస్) వెబ్సైట్ దోహదపడుతుందని విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. ఉన్నత విద్యామండలి రూపొందించిన ఎస్ఏవీఎస్ వెబ్సైట్ను శుక్రవారం ఆమె డీజీపీ మహేందర్రెడ్డితో కలిసి మాసబ్ట్యాంక్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సర్టిఫికెట్లను సులభంగా, అత్యంత వేగంగా ఒకే ఒక్క క్లిక్తో ఈ పోర్టల్ ద్వారా వెరిఫికేషన్ చేయవచ్చునని తెలిపారు. ఈ పోర్టల్ విద్యాశాఖలో ఒక మైలురాయిగా నిలుస్తుందని చెప్పారు. ప్రస్తుతానికి డిగ్రీ, పీజీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవచ్చని, త్వరలోనే ఇంటర్, పదో తరగతి సర్టిఫికెట్లను సైతం వెరిఫికేషన్ చేసుకునే సౌకర్యాన్ని కల్పిస్తామని వెల్లడించారు.
ఇలాంటి పోర్టల్ దేశంలోనే మొదటిదని, 2010 నుంచి 2021 మధ్యకాలంలో పట్టభద్రులైన 25 లక్షల విద్యార్థుల డాటాను, సర్టిఫికెట్లను ఇందులో పొందుపరిచామని వివరించారు. డీజీపీ మహేందర్రెడ్డి మాట్లాడుతూ.. నకిలీ సర్టిఫికెట్లు తయారుచేస్తున్న వారిపై క్రిమినల్ కేసులతోపాటు పీడీ యాక్ట్ను ప్రయోగిస్తున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరు ణ, ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, వైస్ చైర్మన్ ప్రొఫెసర్ వెంకటరమణ, కార్యదర్శి డాక్టర్ ఎన్ శ్రీనివాస్రావు, పలు వర్సిటీల వైస్చాన్స్లర్లు రవీందర్, గోపాల్రెడ్డి, లక్ష్మీకాంత్రాథోడ్, తాటికొండ రమేశ్, రవీందర్ గుప్తా, ఎస్ మల్లేశ్, కన్సల్టెంట్ సదానందం తదితరులు పాల్గొన్నారు.
ఇది వరకు ఇలా..
ఎవరైనా విద్యార్థి దాఖలు చేసిన సర్టిఫికెట్పై అనుమానం వచ్చినా, ఫిర్యాదు వచ్చినా.. సంబంధిత ఏజెన్సీలు తొలుత వర్సిటీలకు లేఖలు రాసేవి. ఒక్కోసారి స్వయంగా వెళ్లి దరఖాస్తు చేయాల్సి వచ్చేది. వర్సిటీల పరీక్షల విభాగాలు పని ఒత్తిడి కారణంగా ఆలస్యంగా స్పందించేవి. ఒక్కొక్కసారి యూనివర్సిటీల నుంచి జవాబు పొందడానికి ఏండ్లు పట్టేది. అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయేది.
ఇప్పుడిలా..
ఈ వెబ్సైట్తో నకిలీ సర్టిఫికెట్లను సులభంగా గుర్తించవచ్చు. ఒకే ఒక్క క్లిక్తో కేవలం నిమిషాల్లోనే అసలుదో, నకిలీదో నిర్ధారించుకోవచ్చు. ప్రపంచంలో ఏ మూలన ఉన్న వారైనా ఈ సేవలను వినియోగించుకోవచ్చు. వెబ్సైట్లో రాష్ట్రంలోని 15 వర్సిటీల పరీక్షల విభాగాలు ఇచ్చిన అధికారిక సమాచారాన్ని పొందుపరిచారు. ఇది అత్యంత నమ్మకమైనది.
సేవలిలా..