వికారాబాద్ : విద్యార్థులందరూ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నారు. ఆ గుంపులో ఒక అబ్బాయి కాళ్లకు చెప్పులు లేవు. అదే దారిలో వెళ్తున్న విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి ఆ బాలుడు కంటపడ్డాడు. అయ్యో పాపం.. విద్యార్థి కాళ్లకు చెప్పులు లేవు కదా.. అని మంత్రి సబిత బాధపడింది. తన కారును ఆపి.. సదరు విద్యార్థిని దగ్గరకు పిలుచుకుంది. ఏమైంది చెప్పులు లేవా..? అని మంత్రి అడిగే సరికి విద్యార్థి సమాధానం విని ఆమె ఆశ్చర్యపోయారు. చెప్పులు ఉన్నాయి కానీ.. బురదలో పాడవుతాయని చెప్పి.. ఇంట్లోనే పెట్టేసి వచ్చానని ఆ బాలుడు మంత్రికి చెప్పారు. చెప్పులు వేసుకోకపోతే కాళ్లు పాడవుతాయని విద్యార్థికి సబిత సూచించారు.
ఈ ఆసక్తికర ఘటన వికారాబాద్ జిల్లా ధారూర్ మండలం కేంద్రానికి సమీపంలో మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. ఇక ప్రతిరోజు స్కూల్కు చెప్పులు వేసుకొని వెళ్లాలని మంత్రి విద్యార్థులకు సూచించారు. అనంతరం అక్కడున్న విద్యార్థులందరికీ మంత్రి సబిత డిక్షనరీలు అందించి, బాగా చదువుకోవాలని ప్రోత్సహించారు.