హైదరాబాద్, జూలై 18 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మౌలిక వసతుల కల్పన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని అధికారులను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ఆదేశించారు. నూతన భవనాలు, అదనపు తరగతి గదులు, టాయిలెట్ల నిర్మాణం కోసం రూ.60 కోట్లు మంజూరు చేసినా సకాలంలో పనులు పూర్తి చేయకపోవడం పట్ల మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం హైదరాబాద్ నాంపల్లిలోని రూసా రిసోర్స్ సెంటర్లో ఇంటర్మీడియట్ విద్యపై మంత్రి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ప్రతీ వారం పనుల పురోగతిని సమీక్షించాలని ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్కు సూచించారు. కళాశాల నిర్వహణ అవసరాలకు, ల్యాబ్ల ఆధునికీకరణ వంటి పనుల కోసం మరో రూ. 4.43 కోట్లు మంజూరు చేశామని, వీటిని వెంటనే చేపట్టాలని ఆదేశించారు. విద్యార్థులకు ఇంకా పాఠ్యపుస్తకాలు అందకపోవడంపై సంబంధిత అధికారులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. పుస్తకాలను వివిధ జిల్లాలకు సరఫరా చేయడానికి ఆర్టీసీ కార్గో పైనే ఆధారపడకుండా, ప్రైవేట్ ఆపరేటర్ల సహాయంతో శుక్రవారం నాటికి చేరేలా చర్యలు చేపట్టాలని సూచించారు.
ప్రవేశాలు తగ్గాయన్న ప్రచారం అవాస్తవం
ప్రభుత్వ కాలేజీల్లో ప్రవేశాల సంఖ్య తగ్గిందనే ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని మంత్రి సబిత స్పష్టంచేశారు. అడ్మిషన్ల తుది గడువు ఇంకా పూర్తి కాలేదని, గడువు ముగిసేనాటికి గత ఏడాదితో పోలిస్తే అధిక ప్రవేశాలు నమోదవవుతాయని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఏడాది 119 జ్యోతిరావ్ ఫూలే బీసీ గురుకులాలను, 38 కేజీబీవీలను, 2 గిరిజన గురుకులాలను ఇంటర్మీడియట్ వరకు అప్గ్రేడ్ చేశామని, వీటిలో కొంతమంది విద్యార్థులు చేరారని మంత్రి వెల్లడించారు.
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ వంటి జిల్లాల్లో ప్రభుత్వ కళాశాలల్లో ఇంటర్ ఉత్తీర్ణత శాతం తగ్గడంపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. అన్ని రకాల వనరులుండి కూడా ఈ మూడు జిల్లాలు ఫలితాల్లో వెనుకబడి ఉండటం సమర్థనీయం కాదని పేర్కొన్నారు. ఇప్పటి నుంచే ప్రత్యేక శ్రద్ధ వహించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆయా జిల్లాల అధికారులకు సూచించారు. సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్మీడియట్ విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, వివిధ జిల్లాల ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులు పాల్గొన్నారు.