విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దని భావించి, సీఎం కేసీఆర్ ఆదేశాలతో పరీక్షలు రద్దుచేశాం. రాష్ట్రంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థులు 4.73 లక్షల మంది ఉన్నారు. వీరి ఫస్టియర్ మార్కుల ఆధారంగా త్వరలో ఫలితాలు వెల్లడిస్తాం.
–మంత్రి సబిత
హైదరాబాద్, జూన్ 9 (నమస్తే తెలంగాణ): కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఇప్పటికే ఇంటర్ ప్రథమ సంవత్సరం పరీక్షలను రద్దుచేసిన ప్రభుత్వం తాజాగా ద్వితీయ సంవత్సరం పరీక్షలను సైతం రద్దుచేసింది. ఈ అంశంపై విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి.. విద్యాశాఖ కార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా, ఇంటర్ బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్, కళాశాల విద్యాశాఖ కమిషనర్ నవీన్మిట్టల్, పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ శ్రీదేవసేన సహా ఇతర ఉన్నతాధికారులతో బుధవారం సమీక్ష నిర్వహించారు. తర్వాత మంత్రి మీడియాతో మాట్లాడుతూ పరీక్షలను రద్దు చేసినట్టు ప్రకటించారు. విద్యార్థుల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టవద్దని భావించి, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు పరీక్షలను రద్దుచేశామని చెప్పారు. రాష్ట్రంలో 4.73 లక్షల మంది విద్యార్థులుండగా, వీరి ఫస్టియర్ మా ర్కుల ఆధారంగా ఫలితాలు వెల్లడిస్తామని తెలిపారు. ఇందుకు విధివిధానాలు రూ పొందించేం దుకు ఇప్పటికే అధికారులతో కమిటీ వేశామని, నివేదిక వచ్చాక ఫలితాలపై స్పష్టత ఇస్తామన్నారు. విద్యార్థులెవరైనా పరీక్షలు రాయాలనుకుంటే పరిస్థితులు చక్కబడిన తర్వాత ఆలోచించి అవకాశం ఇస్తామని తెలిపా రు. కరోనాతో గత ఏడాదికాలంగా పలురకాల పరీక్షల రద్దు లేదా వాయిదావేస్తూ వచ్చామని గుర్తుచేసిన మంత్రి, ఈ ఏడాది 1-10వ తరగతి, ఇంటర్ ఫస్టియర్ పరీక్షలను రద్దుచేసి పైతరగతులకు ప్రమోట్ చేసినట్టు చెప్పారు. ఇంటర్ సెకండియర్ పరీక్షలను నిర్వహించాలని భావించినా ప్రస్తుత పరిస్థితులు, పిల్లల మానసిక వేదన, తల్లిదండ్రుల ఆందోళన దృష్ట్యా పరీక్షలను రద్దుచేసినట్టు వివరించారు. విద్యార్థులకు మార్కుల కేటాయింపు సహా విధివిధానాల రూపకల్పన కోసం ఇంటర్బోర్డు ముగ్గురు సభ్యులతో కమిటీ నియమించింది. పరీక్షల విభాగం కంట్రోలర్ అబ్దుల్ఖలీక్, జాయింట్ సెక్రటరీ శ్రీనివాస్, మరో అధికారితో కమిటీ వేసినట్టు తెలిసింది. ఈ కమిటీ రెండ్రోజుల్లో ఇంటర్బోర్డుకు నివేదిక సమర్పించనుంది.
కరోనా ఉదృతి నేపథ్యంలో ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకోవడంపై ఇంటర్ విద్యా జేఏసీ చైర్మన్ మధుసూదన్రెడ్డి హర్షం వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్ణయం పట్ల ఆర్జేడీ కాంట్రాక్ట్ అధ్యాపకుల సంఘం, రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు గాదె వెంకన్న, కుమార్ సహా పలుసంఘాల నేతలు రమణారెడ్డి, కొప్పిశెట్టి సురేశ్, రామకృష్ణగౌడ్ హర్షం వ్యక్తంచేశారు.