కందుకూరు (హైదరాబాద్ ) : తెలంగాణ విద్యావ్యవస్థ గురించి ఏపీ విద్యా మంత్రి బొత్స సత్యనారాయణ చేసిన వ్యాఖ్యలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Minister Sabtia Reddy ) మండిపడ్డారు. రాష్ట్రాన్ని కించపరిచే విధంగా మాట్లాడితే సహించబోమని హెచ్చరించారు. బొత్స చేసిన వ్యాఖ్యలను ఉప సంహరించుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
ఏపీలో విద్యా వ్యవస్థ బాగుంటే లక్ష మంది విద్యార్థులు ఎందుకు తగ్గారని ఆమె ప్రశ్నించారు. గురువారం కందుకూరు మండల కేంద్రంలో మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకుంటే ఏపీ మాత్రం విరుద్ధంగా మాట్లాడడం శోచనీయమని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR ) రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మెరుగు పరుస్తున్నారని తెలిపారు.
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర ఏర్పడిన తరువాత 1050 గురుకులాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. తెలంగాణలో ఒక్కో విద్యార్ధి పైన రూ.లక్ష 50వేలను ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. విదేశాలకు వెళ్లి చదువుకునే విద్యార్థులకు ఓఆర్సీసీ కింద ప్రతి విద్యార్థికి రూ. 2 .50 లక్షలు ఖర్చు చేస్తున్నామని అన్నారు. గడిచిన తొమ్మిది సంవత్సరాల్లో రెండు సార్లు ఉపాధ్యాయులను బదిలీలు చేశామని గుర్తు చేశారు. కొంత మంది ఉపాధ్యాయులు కోర్టుకు వెళ్లడం వల్ల బదిలీలు ఆగాయని తెలిపారు.