హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు గతంలో గ్రాంట్ రూపంలో నిధులు మంజూరు చేశామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గత మూడేండ్ల నుంచి రాష్ట్రంలోని 26వేల ప్రభుత్వ పాఠశాలల నిర్వహణకు.. 2017-18లో రూ.38 కోట్లు, 2018-19లో రూ.49 కోట్లు, 2019-20లో రూ.46 కోట్లు, 2020-21లో రూ.80 కోట్లు, 2021-22 ఏడాదికి రూ.80 కోట్ల నిధులు కేటాయించినట్లు వెల్లడించారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల నిర్వహణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమాధానం ఇచ్చారు.
రాష్ట్రంలో కొన్ని పాఠశాలల్లో తక్కువ మంది విద్యార్థులుండి, ఎక్కువ మంది ఉపాధ్యాయులున్న పాఠశాలలను గుర్తించే రేషనలైజేషన్ చేస్తున్నామని తెలిపారు. ఆ పోస్టులను సర్దుబాటు చేసిన తర్వాత విద్యావాలంటీర్ల నియామకం గురించి ఆలోచిస్తామన్నారు. కొన్ని ప్రాంతాల్లో 10 నుంచి 20 ఎకరాల్లో ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి. మైదానం ఎక్కువగా ఉండటంతో అక్కడ ప్రకృతి వనాల ఏర్పాటుకు కలెక్టర్లకు తామే ఆదేశాలు ఇచ్చామన్నారు. ఆ పార్కుల వల్ల పిల్లలకు కూడా మంచి వాతావరణం ఇచ్చిన వాళ్లం అవుతామన్నారు. గ్రామపంచాయతీల పరిధిలో ఉన్న పాఠశాలల నిర్వహణను లోకల్ బాడీస్, కార్పొరేషన్, మున్సిపాలిటీల పరిధిలో ఉన్న పాఠశాలలను అర్బన్ లోకల్ బాడీస్ చూసుకోవాలని చెప్పారు. ఇక చాలా గ్రామాల్లో సర్పంచ్లే బాధ్యత తీసుకుని పాఠశాల నిర్వహణను చూస్తున్నారు. ఎక్కడైనా సర్పంచ్లు పాఠశాలల నిర్వహణ బాధ్యత తీసుకోకపోతే ప్రధానోపాధ్యాయుడు ఫిర్యాదు చేసి తమ దృష్టికి తీసుకువస్తే చర్యలు తీసుకుంటామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు.