హైదరాబాద్ : పట్టణాలను స్వచ్ఛంగా మార్చేందుకే పట్టణ ప్రగతి ముఖ్య ఉద్దేశమని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. రంగారెడ్డి జిల్లా జలపల్లి మున్సిపాలిటీలో పట్టణ పగ్రతి కార్యక్రమానికి మంత్రి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా 16,17,19,20 వార్డుల్లో బీటీ, సీసీ రోడ్డు పనులు, వరద నీటి కాలువ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే శ్రీరామ్ కాలనీలో రూ.18లక్షల నిర్మించిన వరద నీటి కాలువను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా జల్పల్లి అంగన్వాడీ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ పట్టణ ప్రగతిలో భాగంగా ప్రతి నెలా మున్సిపాలిటీకి రూ.36లక్షల నిధులు వస్తున్నాయన్నారు.
జిల్లాలోని మొత్తం 16 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు కలిపి ప్రతి నెలా రూ.2.12కోట్లు నిధులు మంజూరు చేస్తున్నామని, ఇప్పటి వరకు రూ.57.14కోట్ల నిధులు వచ్చాయన్నారు. కౌన్సిలర్లు తమ, తమ వార్డుల్లో ఒక వాహనం నలుగురు సిబ్బందితో చెత్తను తొలగించేలా చూడాలన్నారు. చెత్త రహిత మునిసిపాలిటీగా జల్పల్లి మునిసిపాలిటీని తీర్చిదిద్దుదామన్నారు. పట్టణ ప్రగతి ద్వారా చేపడుతున్న కార్యక్రమాలతో నేడు సీజనల్ వ్యాధులు తగ్గుముఖం పట్టాయన్నారు. మునిసిపాలిటీల్లో 1.20లక్షల మొక్కులు నాటే లక్ష్యంతో పని చేయాలన్నారు.
అన్నివార్డుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారన్నారు. స్థలాలు ఎంపిక చేసుకొని వెంటనే వివిధ క్రీడలకు సంబంధించిన కోర్టులను సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. బడిబాట కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించి, నమోదుశాతాన్ని పెంచాలన్నారు. మునిసిపాలిటీ పరిధిలో పహాడి షరీఫ్, షాహీన్ నగర్, కొత్తపేట్, జల్పల్లి, శ్రీరామ్నగర్లలో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు. కార్యక్రమంలో చైర్మన్ అబ్దుల్ సాధి, వైస్ చైర్మన్ ఫర్హానా నాజ్, కమిషనర్ జీపీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.