హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల ఉజ్వల భవిష్యత్కు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని, అందుకనుగుణంగా చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. విద్యా సంవత్సరం ప్రారంభం సందర్భంగా హైదరాబాద్లోని మహబూబియా బాలికల ఉన్నత పాఠశాలను మంత్రి సబితా ఇంద్రారెడ్డి సోమవారం ఉదయం పరిశీలించారు. ఆయా క్లాసులను తిరుగుతూ విద్యార్థులతో మంత్రి ముచ్చటించారు. ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులతో సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా సమావేశమై పలు అంశాలపై చర్చించి, వివరించారు.
అనంతరం మంత్రి మాట్లాడుతూ.. కార్పొరేట్ విద్యాసంస్థలను తలదన్నేలా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలను నెలకొల్పుతున్నామని స్పష్టం చేశారు. విద్యార్థులందరికీ నాణ్యమైన భోజనం అందిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యా వ్యవస్థలో తీసుకొచ్చిన సంస్కరణలు సత్ఫలితాలను ఇస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు ఇంగ్లీష్ మీడియంను కూడా అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. ఈ క్రమంలో ప్రయివేటు బడుల నుంచి గవర్నమెంట్ స్కూల్లోకి విద్యార్థులు పోటెత్తుతున్నారని తెలిపారు. ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో 75 వేల మందికి పైగా ప్రవేశాలు జరిగాయన్నారు. ప్రభుత్వ పాఠశాలలపై భరోసా కల్పించే విధంగా ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించాలని సబితా ఇంద్రారెడ్డి సూచించారు.