హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలతో రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు నాణ్యమైన విద్యను అందించేందుకు చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, హరీష్ రావులు పిలుపునిచ్చారు. మన ఊరు – మన బడి కార్యక్రమంపై జిల్లా కలెక్టర్లతో రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావులు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. బీర్కే భవన్ నుండి నిర్వహించిన ఈ వీడియో కాన్ఫరెన్స్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యా శాఖ కార్యదర్శి సందీవ్ కుమార్ సుల్తానియా, డైరెక్టర్ దేవ సేన తదితరులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి మాట్లాడుతూ.. మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలను కార్పొరేట్ పాఠశాలలకు ధీటుగా తీర్చిదిద్దెందుకు ప్రణాళికలు రూపొందించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొదటి దశలో 9,123 పాఠశాలల్లో రూ.3497.62 కోట్లతో 12 రకాల మౌలిక సదుపాయాల కల్పనకు ప్రాధాన్యతనిస్తున్నామని వివరించారు. రూ. 30 లక్షలలోపు పనులను పాఠశాల నిర్వహణా కమిటీలకు అప్పగించామని వెల్లడించారు. రూ.30 లక్షలకు పైబడి పనులను టెండర్ల ద్వారా చేపడుతున్నట్టు మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.
అనంతరం మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ.. మన ఊరు – మన ఊరి బడి కార్యక్రమానికి నిధుల కొరత లేదని, ఇప్పటికే అన్ని జిల్లాలకు అడ్వాన్స్ గా నిధులు విడుదల చేశామన్నారు. విద్యా యజ్ఞంగా చేపట్టిన మన ఊరు – మన బడి కార్యక్రమంలో మంజూరు చేసిన పనులన్నింటినీ సీనియర్ అధికారులతో తనిఖీ చేయించాలని కోరారు. పనుల ప్రారంభానికి ముందు పాఠశాల ఏ విధంగా ఉంది.. పనుల తర్వాత ఏ విధంగా ఉందనే దానిపై ఫోటోలు తీయించాలని సూచించారు. ప్రతీ మండలానికి ఒక ప్రత్యేక అధికారిని నియమించి పనులను నాణ్యతను పరిశీలించాలని, త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలని అధికారులను హరీశ్రావు ఆదేశించారు.
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ మాట్లాడుతూ.. రూ. 30 లక్షల లోపు పనులన్నింటికీ ఈ నెల 10వతేదీ లోపు పరిపాలన సంబంధిత ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. మే 15 నాటికి పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. రూ. 30 లక్షలకు పైబడ్డ పనులకు ఈనెలాఖరు వరకు టెండర్ల పక్రియను పూర్తి చేసి పనులను చేపట్టాలని ఆదేశించారు.