హైదరాబాద్ : పాదయాత్ర పేరిట ప్రజలను మోసం చేస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్పై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నిప్పులు చెరిగారు. తన నియోజకవర్గానికి ఏం చేశానని తనను ప్రశ్నించే కంటే ముందు.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా తెలంగాణకు ఎన్ని నిధులు తెచ్చాడో శ్వేతపత్రం విడుదల చేయాలని సబిత డిమాండ్ చేశారు.
టీఆర్ఎస్ ఎల్పీలో సబితా ఇంద్రారెడ్డి మీడియాతో మాట్లాడారు. శ్మశాన వాటిక, డంపింగ్ యార్డుల్లో మా వాటా ఉందని ఆయన అంటున్నాడు. మరి దేశమంతా ఇవి ఎందుకు లేవు. బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు దేశమంతా పల్లె ప్రగతి ఎందుకు అమలు చేయడం లేదు. విజన్ ఉన్న నాయకత్వం ఉంటేనే ఇలాంటి కార్యక్రమాలు సాధ్యమవుతాయన్నారు. పల్లె ప్రగతి ద్వారా గ్రామాలు అభివృద్ధి చెందాయన్నారు. స్వచ్ఛ గ్రామాలుగా మనవే టాప్లో ఉన్నాయి. ఇదే తుక్కుగూడలోనే మీరు రేపు మీటింగ్ పెడుతున్నారు కదా.. అదే తుక్కుగూడలో మీ సభా ప్రాంగణం నుంచి రైట్ సైడ్ చూస్తే డబుల్ బెడ్రూం ఇండ్లు, లెఫ్ట్ సైడ్ చూస్తే14 సెకన్లకు ఓ టీవీ తయారయ్యే కంపెనీ కనిపిస్తది. తుక్కుగూడలో 57 కంపెనీలు ఉన్నాయి. రూ. 3 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. 18 వేల మంది పిల్లలు పని చేస్తున్నారు. ఇవన్నీ తిరిగి చూస్తే తెలుస్తదని సంజయ్కు సబితా సూచించారు.
నా నియోజకవర్గ ప్రజలకు నేనేం చేశాను.. ఏం చేస్తున్నాను.. ఏం చేయబోతున్నానను అనే విషయం నేను చెప్పుకుంటాను.
ముందు మీరు ఈ రాష్ట్రానికి ఏం చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రజలకు ఏం అవసరం ఉంది.. రాష్ట్రాభివృద్ధికి ఏం కావాలనే అంశాలపై ఆలోచించాలన్నారు. విద్వేషాలు రెచ్చగొట్టడమే బీజేపీ నాయకుల ఎజెండా అని సబిత విమర్శించారు.