హైదరాబాద్ : గోల్కొండ పరిధిలోని తారామతి భారదరి రిసార్ట్లో తెలంగాణ స్కూల్ ఇన్నోవేషన్ ఛాలెంజ్ 2021-22 కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఐటీ శాఖ మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి హాజరయ్యారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు రూపొందించిన వివిధ ఆవిష్కరణలను మంత్రులు పరిశీలించారు. విద్యార్థుల ఆవిష్కరణలను ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ.. భవిష్యత్లో శాస్త్రవేత్తలు, పారిశ్రామికవేత్తలుగా రూపాంతరం చెందే పిల్లలందరికీ శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా పని చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందన్నారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకతను వెలికి తీసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. వారిలో ఉన్న ఆలోచనాశక్తికి అభినందనలు తెలియజేస్తున్నాను. విద్యార్థుల్లో ఉన్న మేథాశక్తిని వెలికితీయాల్సిన అవసరం ఉందన్నారు.
పేదరికంలో ఉన్న పిల్లలను ప్రోత్సహించాలని సీఎం కేసీఆర్ చెబుతుంటారు. యునిసెఫ్ సహకారంతో విద్యార్థులు మరిన్ని విజయాలు సాధించాలన్నారు. సైన్స్ ల్యాబ్లు, గ్రంథాలయాలను ప్రతి పాఠశాలలో ఏర్పాటు చేస్తున్నాం. ఇవాళ విజేతలుగా నిలిచిన విద్యార్థులందరూ భవిష్యత్లో పది మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆకాంక్షించారు.