ఖమ్మం, ఏప్రిల్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరికి దమ్ముంటే ఖమ్మంలో తనపై పోటీ చేయాలని, తాను ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ సవాల్ విసిరారు. ఖమ్మంలో మంగళవారం నిర్వహించిన బీఆర్ఎస్ ప్రతినిధుల సభలో మంత్రి మాట్లాడుతూ.. ప్రజల డబ్బుతో రాజకీయం చేసే నీచ సంస్కృతి రేణుకాచౌదరిది అని విమర్శించారు.
టిక్కెట్లు ఇప్పిస్తానని మోసం చేసి ఓ గిరిజన నేత చనిపోవడానికి కారణమైన రేణుక.. ఇప్పుడు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉన్నదని విమర్శించారు. తనపై ఆమె మాట్లాడిన ప్రతి మాటపైనా న్యాయపరంగా పోరాడుతానని హెచ్చరించారు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికి చిప్పకూడు తిన్న రేవంత్రెడ్డి ఒక్కరోజు ఖమ్మం వచ్చి షో చేస్తే ఇక్కడి ప్రజలు నమ్మరని స్పష్టంచేశారు. సభలో ఎంపీలు నామా నాగేశ్వరరావు, వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తాతా మధు తదితరులు పాల్గొన్నారు.