ఖమ్మం సెప్టెంబర్ 22 : తెలంగాణలో వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని, బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఖమ్మం నగరంలోని భక్తరామదాసు కళాక్షేత్రంలో శుక్రవారం ఆయన 398 మందికి జీవో 58 ఇళ్ల పట్టాలు, 230 మంది లబ్ధిదారులకు ‘గృహలక్ష్మి’ ప్రొసీడింగ్ పత్రాలు అందించి మాట్లాడారు. ప్రజాబలం బీఆర్ఎస్కే ఉందన్నారు.
సీఎం కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నారు. ప్రభుత్వ స్థలాల్లో దశాబ్దాలుగా నివాసం ఉంటున్న పేదలకు గూడు ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రత్యేక జీవో తీసుకువచ్చి ఆయా స్థలాలకు పట్టాలు అందిస్తున్నదన్నారు. సొంత స్థలం ఉండి ఆర్థిక స్తోమత లేక ఇల్లు కట్టుకునే వారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందించేందుకే గృహలక్ష్మి పథకాన్ని అమలు చేస్తున్నదన్నారు.
అనంతరం మంత్రి నగరంలోని 52వ డివిజన్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం ప్రధాన దవాఖానను సందర్శించి ప్రజలకు అందుతున్న వైద్యసేవలను పరిశీలించారు. రోగులతో మాట్లాడి వారికి అందుతున్న సేవలపై ఆరా తీశారు.
మంత్రి వెంట ఖమ్మం కలెక్టర్ వీపీ గౌతమ్, రాష్ట్ర విత్తనాభివృద్ధి సంస్థ చైర్మన్ కొండబాల కోటేశ్వరరావు, ఖమ్మం నగర మేయర్ పునుకొల్లు నీరజ, స్తంభాద్రి అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ బచ్చు విజయ్కుమార్, డీసీసీబీ చైర్మన్ కూరాకుల నాగభూషణం, నగరపాలక సంస్థ కమిషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్, కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు.