ఖమ్మం, నవంబర్ 26 : అటు దేశంలోగానీ, ఇటు రాష్ట్రంలోగానీ అసలు కాంగ్రెస్ పార్టీకే గ్యారెంటీ లేదని ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి పువ్వాడ అజయ్కుమార్(Minister Puvvada) విమర్శించారు. అలాంటి ఆ పార్టీ నేతలు ఇక ప్రజలకేం గ్యారెంటీలిస్తారని ఎద్దేవాచేశారు. దేశాన్ని అభివృద్ధి చేయడంలో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టారు. ప్రజలు 11 సార్లు అవకాశం ఇచ్చినా వారికి పావలావంతు కూడా మేలు జరగలేదని ధ్వజమెత్తారు. అలాంటి కాంగ్రెస్ పార్టీ నేతలు ఇప్పుడు తాము అభివృద్ధి చేస్తామంటూ ముందుకు వస్తుండడం విడ్డూరంగా విమర్శించారు.
గత 11 పర్యాయాల్లో చేయని అభివృద్ధిని ఇప్పుడెలా చేస్తారంటూ ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఖమ్మం నగరంలో ఆదివారం పర్యటించిన ఆయన.. 4, 5, 6 డివిజన్లలో నిర్వహించిన రోడ్ షోల్లో మాట్లాడారు. అభివృద్ధికి మారుపేరుగా నిలిచింది బీఆర్ఎస్ ప్రభుత్వం మాత్రమేనని స్పష్టం చేశారు.
అందులో భాగంగానే నేడు తెలంగాణను అభివృద్ధిలో దేశంలోనే అగ్రభాగాన నిలిపిన ఘనతను సొంతం చేసుకుందని అన్నారు. ఇక్కడి ప్రజల అవసరాలు, కష్టాలు తెలిసిన తన వల్లనే ఖమ్మం ఇంతలా అభివృద్ధి చెందిందని స్పష్టం చేశారు. అయితే, ఖమ్మం అభివృద్ధి అతడి వల్లనేనని కాంగ్రెస్ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు చెప్పుకుంటుండడం సిగ్గుచేటని అన్నారు.30న జరిగే ఎన్నికల్లో తనకు అత్యధిక మెజార్టీ ఇవ్వాలని కోరారు.