ఖమ్మం : గోదావరి ( Godavari ) కి వస్తున్న వరద వల్ల ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు అధికారులు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ( Minister Puvvada AJaykumar) ఆదేశించారు.గోదావరి వరదల ( Floods ) నేపథ్యంలో మంత్రి పువ్వాడ శుక్రవారం భద్రాచలం బ్రిడ్జి పై నుంచి వరద ఉద్ధృతి పరిస్థితులను పరిశీలించారు.
అనంతరం భద్రాచలం సబ్ కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ ప్రియాంక ఆధ్వర్యంలో జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గోదావరి వరద ముంపు ప్రాంతాల బాధితులను తక్షణమే గుర్తించి ముందస్తుగా వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద ఉద్ధృతిని బట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు ముంపునకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయని, ప్రజలు రాకపోకలు చేయకుండా నియంత్రణ చేయాలని పేర్కొన్నారు.
లోతట్టు రహదారుల వద్ద బారికెడ్లు ఏర్పాటుచేసి ప్రమాద హెచ్చరికలు జారీ చేయాలని వెల్లడించారు. వచ్చే రెండు నెలలు ఇదే పరిస్థితిని కొనసాగించాలని కోరారు. గోదావరి పరివాహ ప్రాంతాల్లో ప్రజలు ఎవరూ సంచరించకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు తప్పనిసరిగా ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లాలోని పరిశ్రమల ఆధ్వర్యంలో ఉన్న రెస్క్యూ టీములను అందుబాటులో ఉంచాలని చెప్పారు.
ప్రస్తుతానికి ఉద్ధృతి తగ్గు ముఖం పడుతున్నప్పటికీ విశ్రాంతి తీసుకోవద్దని అధికారులు అన్ని సందర్భాల్లో సిద్ధంగా ఉండాలన్నారు. , ప్రస్తుతం అన్ని ప్రాజెక్ట్స్ నిండు కుండలా మారాయని, ఎక్కడ ఏ ప్రాజెక్ట్ నుంచి నీరు విడుదల చేసిన అవి గోదావరిలోకే వచ్చి చేరుతాయి కాబట్టి అధికారులు అప్రమత్తం గా ఉండాలన్నారు . ప్రాణ నష్టం, అస్తి నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడూ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందస్తు చర్యలు తీసుకోవాలని కోరారు.
మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలి
పునరావాస కేంద్రాల్లో వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలని మంత్రి ఆదేశించారు. నిరంతర పారిశుధ్య కార్యక్రమాలు నిరంతరాయంగా చేపట్టాలని సూచించారు. విద్యుత్ అంతరాయం లేకుండా చర్యలు చేపట్టాలని విద్యుత్ ఎస్ఈ కి ఆదేశించారు. ప్రజలకు సురక్షిత మంచినీరు సరఫరా చేయాలని, పునరావాస కేంద్రాల్లో గత సంవత్సరం చేసిన విధంగా నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.