ఖమ్మం : ఉచితాలు వద్దంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డికి రైతులు తగిన బుద్ధి చెప్పాలని రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Minister Puvvada ) పిలుపునిచ్చారు. ఖమ్మం నియోజకవర్గం రఘునాథ్ పాలెం మండలం మంచుకొండ గ్రామంలో బీఆర్ఎస్ (BRS ) మండల పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేశారు. రేవంత్ దొంగ.. డౌన్ డౌన్ రేవంత్ అంటూ నినాదాలతో హోరెత్తించారు.
మంత్రి పువ్వాడ మాట్లాడుతూ రేవంత్ రెడ్డి (Revanth Reddy ) పేదలకు అన్యాయం చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ కు ఓటేస్తే ఇక 3గంటల కరెంట్ వస్తుందని, మళ్లీ పాతరోజులు వస్తాయన్నారు. రైతులు, వ్యవసాయం గురించి రేవంత్ రెడ్డికి ఏం తెలుసని ప్రశ్నించారు. 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తే రైతులు తమకు అనుకూలమైన సమయంలో పొలాలకు నీళ్లు పారించుకుంటున్నారని తెలిపారు. ఒక పక్క బీజేపీ రైతుల మోటర్లుకు మీటర్లు పెట్టాలంటోంది. మరోవైపు కాంగ్రెస్ 24గంటల విద్యుత్ వద్దు అంటోంది. ఈ రెండు పార్టీలు ప్రజలను మోసం చేయాలని చూస్తున్నాయని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో రాత్రి కరెంట్ వల్ల కరెంట్ షాక్ లు, పాము కాట్లతో రైతులు చనిపోయిన ఘటనలు అనేక ఉన్నాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ దళారుల కోసం, బీజేపీ పార్టీ ఆదాని, అంబానీ కోసం పనిచేస్తే కేసీఆర్ రైతుల కోసం పనిచేస్తున్నారని వెల్లడించారు . రైతుల పై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుకు పట్టిన గతే కాంగ్రెస్కు పడుతుందని హెచ్చరించారు.